దేశ రాజధాని ఢిల్లీలో అతిషి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో అత్యంత వేగంగా వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ముందు జాగ్రత్తగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14(సోమవరం) నుంచి జనవరి 1 వరకు హస్తినలో టపాసుల కాల్చివేతపై నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యాటవరణ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం నుంచి బాణాసంచా నిల్వ ఉంచడం, అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం 2025, జనవరి వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్ ట్విట్టర్లో పేర్కొ్న్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
బాణాసంచాపై నిషేధం విధిస్తూ ఢిల్లీ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా హస్తిన వాసుల సహకారాన్ని కూడా కోరింది. ఇక నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ వివరణాత్మక సూచనలను జారీ చేసింది. ఆన్లైన్లో విక్రయించే వాటితో సహా అన్ని రకాల పటాకులకు నిషేధం వర్తిస్తుంది. శీతాకాలంలో వాయు కాలుష్యం పెరగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీకి రోజువారీ చర్య నివేదికలను సమర్పించాల్సిన అవసరం ఉన్నందున.. నిషేధాన్ని అమలు చేసే బాధ్యత ఢిల్లీ పోలీసులపై పడింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు.