దేశ రాజధాని ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదం కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరుగురు నిందితులను రౌస్ అవెన్యూ కోర్టు నాలుగు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని సీబీఐ పేర్కొంది. అన్ని తెలిసే.. బేస్మెంట్లో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించారని ఆరోపించింది. ఆగస్టు 7న ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో సెల్లార్లోకి వర్షపు నీరు ప్రవేశించి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: AP Health Minister: వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి..
బేస్మెంట్లో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించేందుకు నిబంధనలు అంగీకరించవు. అయినప్పటికీ యాజమాన్యం కోచింగ్ నిర్వహించిందని ఢిల్లీ కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ భవనానికి సేఫ్టీ సర్టిఫికేట్ లేదనే విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేసింది. దీంతో పాటు నగరంలోని అనేక కోచింగ్ సెంటర్లకు ఈ సర్టిఫికేట్ లేదని విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో మరింత విచారణ కొనసాగించేందుకు ఇనిస్టిట్యూట్ యజమాని అభిషేక్ గుప్తాతో సహా మరో ఐదుగురు నిందితులను కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరింది. సీబీఐ పిటిషన్ పరిశీలించిన కోర్టు వారిని నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Bihar: కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్పై దాడి