సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగియలేదు.. ఆరోగ్యమంత్రి వార్నింగ్

Harsh Vardhan

Harsh Vardhan

కరోనా ఫస్ట్‌ వేవ్‌ కంటే.. సెకండ్‌ వేవ్‌లో రికార్డుస్థాయిలో కేసులు వెలుగు చూశాయి.. పెద్ద సంఖ్యలో కోవిడ్‌ బాధితులు ప్రాణాలు పోయాయి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది లేదు.. కానీ, కేసులు తగ్గుతుండడంతో.. లాక్‌డౌన్‌ నుంచి అన్‌లాక్‌కు వెళ్లిపోతున్నాయి రాష్ట్రాలు.. ఈ నేపథ్యంలో.. కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌.. కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించిన ఆయన.. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ కోవిడ్‌ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు.. కరోనా మహమ్మారి పై ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్‌ అనిల్ బైజాల్‌, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌లతో ఏర్పాటు చేసిన వర్చువల్‌ మీటింగ్‌లో మాట్లాడిన హర్షవర్ధన్‌.. ఇంకా సెకండ్‌ వేవ్‌ ముగిసిపోలేదు. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని.. ఒకటిన్నరేళ్లుగా మనకున్న అనుభవం ఈ విషయాన్ని చెబుతుందన్నారు.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని స్పష్టం చేశారు.