ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడిపోయాయి.. హామీ వర్షం కురిపిస్తున్నాయి.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు.. గ్యాస్ ధర ఆల్టైం హై రికార్డులను తాకిన విషయం తెలిసిందే కాగా.. ఓ వైపు అధికారపక్షాన్ని టార్గెట్ చేస్తూనే.. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? అనేదానిపై కూడా హామీ ఇస్తున్నారు.. ఇక, ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. హరిద్వార్, ఉధమ్సింగ్ నగర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలకు నాలుగు కీలకమైన హామీలు ఇచ్చారు.
Read Also: ఒవైసీని చంపాలనే కాల్పులు.. అందుకే లేపేయాలనుకున్నా..!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.. ఇక, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.500 కంటే తక్కువకే అందిస్తామన్న ఆయన.. న్యాయ్ స్కీమ్ను అమలు చేస్తాం.. ఈ పథకం ద్వారా 5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు… ఇంటి వద్దకే వైద్య సాయం అందేలా మార్పులు చేస్తామని వెల్లడించారు.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్లలో రైతులకు రుణ మాఫీ చేస్తామని వాగ్దానం చేశాం.. అది అమలు చేసి చూపించామన్న రాహుల్.. ఉత్తరాఖండ్లో కూడా తాము ఇస్తున్న హామీలను కచ్చితంగా నెరవేరుస్తాం అన్నారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ.. గతంలో భారత్ను ప్రధాన మంత్రి పాలించే వారు.. కానీ, ఇప్పుడు రాజు పాలిస్తున్నాడంటూ సెటైర్లు వేశారు.. ప్రధాని మంత్రి అంటే అందరి కోసం పని చేయాలి.. ప్రజలు చెప్పేది కూడా వినాలి.. కానీ, మోడీ ప్రధాని కాదు.. ఆయన ఒక రాజు అంటూ ఎద్దేవా చేశారు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీన ఉత్తరాఖండ్లో పోలింగ్ జరగనుండగా.. మార్చి 10వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.
