Congress Comeback: 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టి ఉండవచ్చు. కానీ ఈ గణాంకాల వెనుక భారత రాజకీయ గమనాన్ని మార్చగల ఒక లోతైన కథ దాగి ఉంది. అది ‘కాంగ్రెస్ పార్టీ పునరాగమనం’. పైకి ఓటమిలా కనిపిస్తున్నా, వ్యూహాత్మకంగా చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద రాజకీయ లబ్ధిదారుగా అవతరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కేరళలో దశాబ్ద కాలం తర్వాత ‘హస్తం’ హవా..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు దక్కిన అతిపెద్ద విజయం కేరళ. పదేళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. దక్షిణ భారతదేశం కాంగ్రెస్ ఒక అభేద్యమైన కంచుకోట అని, ఇక్కడ బీజేపీ గడ్డు రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటోందని కేరళ ఫలితాలు మరోసారి నిరూపిస్తున్నాయి. ఈ విధంగా దక్షిణాన కర్ణాటక, తెలంగాణల తర్వాత కేరళలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడనుంది. నిజానికి కేరళలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల చరిష్మా, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత రాష్రాన్ని కాంగ్రెస్కు సురక్షిత ప్రాంతంగా మార్చాయి. కర్ణాటక, తెలంగాణ తర్వాత కేరళలోనూ గెలవడంతో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇక్కడ బీజేపీ ఎంత ప్రయత్నించినప్పటికీ, తన స్థానాలను పెంచుకోలేకపోయింది.
బెంగాల్లో ‘కోల్పోయిన పట్టు’ మళ్లీ సొంతం..
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో నిజానికి బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు అతిపెద్ద ‘ఎక్స్-ఫ్యాక్టర్లు’గా నిలిచాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినప్పటికీ, దశాబ్దాల క్రితం తన చేజారిన రాజకీయ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. 2021లో బెంగాల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగు అయ్యింది. కానీ ఈ దఫా జరిగిన ఎన్నికల్లో బెంగాల్లో కాంగ్రెస్ 3% ఓట్ల వాటాను సంపాదించి, రెండు సీట్లను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) బలహీనపడటం కాంగ్రెస్కు వరంగా మారింది. టీఎంసీ పతనం తర్వాత ఏర్పడిన ప్రతిపక్ష శూన్యతను పూరించడానికి లౌకికవాద ఓటర్లు మళ్లీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇక్కడ పోరు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీతో సంబంధం ఉన్న ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో తన రాజకీయ పట్టును బలపరుచుకునేందుకు కాంగ్రెస్కు ఇప్పుడు అవకాశం ఉంది. బెంగాల్లో అధికార మార్పిడి భవిష్యత్తులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీకి దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో వామపక్షాలు బలహీనపడటం, మమతా బెనర్జీ తన వర్గాన్ని ఐక్యంగా ఉంచుకోలేకపోవడం కారణంగా భవిష్యత్తులో ఈ రెండు జాతీయ పార్టీల మధ్య అసలైన పోరు నెలకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
తమిళనాడులో ద్రవిడ రాజకీయాల దాటి..
తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)పై వీస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత, ‘దళపతి’ విజయ్ ఎదుగుదల నేపథ్యంలో కాంగ్రెస్ తనకంటూ ఒక స్వతంత్ర గుర్తింపును ఏర్పరచుకుంది. దశాబ్దాల తర్వాత, తమిళనాడు రాజకీయాలు ద్రవిడ రాజకీయాలకు అతీతంగా పయనిస్తున్నాయి. తమిళనాడు ఓటర్లు విజయ్కు అవకాశం ఇవ్వడం, ఇప్పుడు జనాలు సంప్రదాయ అభ్యర్థులకు అతీతంగా కొత్త ఎంపికలను ఎంచుకుంటున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ సంక్షోభం చోటుచేసుకుంటోంది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ రాజకీయాల (డీఎంకే-ఏఐఏడీఎంకే) ఆధిపత్యానికి చరమగీతం పాడినట్లు అయ్యింది. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆధిపత్య శక్తిగా ఎదగడానికి ఒక అవకాశాన్ని కల్పించగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ద్రావిడ రాజకీయ పార్టీల కారణంగానే అధికారం కోల్పోయి, తిరిగి రాలేక కేవలం ఒక ‘జూనియర్ భాగస్వామి’గా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు విజయ్ పార్టీ గెలుపు, అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి టీవీకేకు కాంగ్రెస్ అవసరం ఏర్పడటం చూస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్కు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అస్సాంలో మతపరమైన ధ్రువీకరణకు చెక్
అస్సాం ఫలితాలు కాంగ్రెస్కు జాక్పాట్ కంటే తక్కువ కాదు. నిజానికి ఇక్కడ బీజేపీ హ్యాట్రిక్ అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ, కాంగ్రెస్ బద్రుద్దీన్ అజ్మల్ (ఏఐయూడీఎఫ్) రాజకీయాలకు ముగింపు పలికింది. చాలా కాలంగా అస్సాంలోని ముస్లిం ఓటు బ్యాంకు అజ్మల్ – కాంగ్రెస్ మధ్య విభజించబడి, నేరుగా బీజేపీకి ప్రయోజనం చేకూర్చింది. అయితే 2026లో మైనారిటీ ఓటర్లు పూర్తిగా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. బద్రుద్దీన్ అజ్మల్ ఓటమి అస్సాం భవిష్యత్ రాజకీయాలను ద్విముఖంగా మార్చేసింది. ఇప్పుడు బీజేపీకి ఓట్లను చీల్చే పార్టీలు ఏవీ మిగలకపోవడంతో, భవిష్యత్తులో కాంగ్రెస్కు అధికార పీఠం సులువుగా చేజిక్కించుకునే మార్గం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇకపై ముస్లిం ఓట్లను కోల్పోతామనే భయం లేకుండా, బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయడంలో మరింత బహిరంగ పాత్ర పోషించగలదా అనేది చూడాలి.
కాంగ్రెస్ నిజమైన “లాభం” ఎలా పొందిందంటే..
ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలు మమతా బెనర్జీ, స్టాలిన్, బద్రుద్దీన్ అజ్మల్ వంటి నాయకులను బలహీనపరిచి, ప్రతిపక్ష “ఇండియా” కూటమిలో కాంగ్రెస్ను అత్యంత శక్తివంతమైన పాత్రలో నిలబెట్టాయి. దీంతో ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇకపై కాంగ్రెస్ షరతుల ప్రకారమే రాజకీయాలు చేస్తాయి. గత కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, డీఎంకే బలంగా ఉండటం కాంగ్రెస్కు అతిపెద్ద సమస్యగా ఉండేది. ఈ 2026 ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు దేశ వ్యాప్తంగా ఒక కొత్త “అవకాశాన్ని” కల్పించాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ‘సాంస్కృతిక జాతీయవాదం’కు వ్యతిరేకంగా ‘రాజ్యాంగ జాతీయవాదం’ను నిలబెట్టి ఓట్లు గెలుచుకోగలమని నిరూపించుకోవడానికి కాంగ్రెస్కు ఒక అవకాశం లభించిందని అంటున్నారు. ఈ ఎన్నికలు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, ఆ పార్టీ కార్యకర్తలు ఇకపై ఆత్మరక్షణలో కాకుండా, దూకుడుగా ఉండాలని సూచించారు.
2026 అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్కు ఒక ‘పెద్ద ముందడుగు’ కానున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రకారం ‘అధికారం’ బీజేపీకి వరించినా, భవిష్యత్ అవకాశాలను మాత్రం కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలు కుప్పకూలినప్పుడల్లా, కాంగ్రెస్ ఫీనిక్స్ పక్షిలా పుంజుకుందని చరిత్రే సాక్ష్యంగా నిలిచింది. 2026 ఎన్నికల ఫలితాలు బీజేపీకి అధికారాన్ని ఇవ్వడంతో పాటు, కాంగ్రెస్కు ఒక ఆశాకిరణాన్ని కూడా అందించాయి. ఇకపై కాంగ్రెస్ కేవలం ఒక పార్టీ మాత్రమే కాదని, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న ఏకైక శక్తి అని నిరూపించుకుంది. ప్రాంతీయ పార్టీల రాజకీయాలు కుంచించుకుపోవడం భవిష్యత్ రాజకీయ పోరాటాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోరుగా మార్చగలదా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
