Goa Results: స్వల్ప ఓట్లతో సీఎం సావంత్‌ విజయం.. ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా..!

గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ స్వల్ప ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు.. ఈ రోజు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శాంక్విలిమ్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి 650 ఓట్ల తేడాలో గెలుపొందారు సావంత్.. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి ధర్మేష్‌ సగ్లానీపై ఆయన విక్టరీ కొట్టారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. గోవాలో మరోసారి తాము (బీజేపీ) సర్కార్‌ ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం ఘనత ప్రతీ కార్యకర్తకు దక్కుతుందన్న ఆయన.. ఇక, ఇండిపెండెంట్‌ అభ్యర్థి చంద్రకాంత్‌ శెట్యే బీజేపీకి మద్దతు ఇచ్చారని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా కోరినట్లు వెల్లడించారు..

Read Also: Punjab: ఆప్‌ ప్రభంజనం.. 5 సార్లు సీఎంగా చేసిన మహానేతకు ఓటమి తప్పలేదు

40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో భారతీయ జనతా పార్టీ 40 మంది సభ్యులకు బరిలోకి దింపింది.. ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో 332 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్-జీఎఫ్‌పీలు 40 మంది చొప్పున అభ్యర్థులను నిలబెట్టగా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గతంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన స్వతంత్ర అభ్యర్థులను పార్టీలు తమవైపు తిప్పుకోవడంతో కోస్తా రాష్ట్రం తీవ్ర రాజకీయ పోరుకు కేంద్రంగా మారింది. ఇప్పటి వరకు 20 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్‌ 12 చోట్ల, టీఎంసీ 2 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు..