Site icon NTV Telugu

Cash-For-Query Case: తృణమూల్ నేత మహువా మోయిత్రా ఇంటిలో సీబీఐ సోదాలు..

Cash For Query Case

Cash For Query Case

Cash-For-Query Case: క్యాష్ ఫర్ క్వేరీ కేసులో కోల్‌కతాలోని తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ఇంట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు సోదాలు నిర్వహించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఒక రోజు తర్వాత ఈ దాడులు జరిగాయి. క్యాష్ ఫర్ క్వేరీ కేసులో విచారణ జరిపి 6 నెలల్లో నివేదిక సమర్పించాలని లోక్‌పాల్ ఈ వారం ప్రారంభంలో సీబీఐని కోరింది. దర్యాప్తుపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నట్లు మోయిత్రాపై అభియోగాలు నమోదయ్యాయి.

Read Also: Kadapa Crime: కడపలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

ప్రధాని నరేంద్రమోడీ, వ్యాపారవేత్త అదానీని టార్గెట్ చేస్తూ మహువా మోయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారని, ఇందుకోసం వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, గిప్టులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీంతో పాటు ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో గతేడాది ఎథిక్స్ కమిటీ ఆమెను విచారించింది. తాను ఇతరులతో లాగిన్ వివరాలను పంచుకున్నట్లు మహువా అంగీకరించింది. ఇదిలా ఉంటే దర్శన్ హీరానందానీ కూడా ఎథిక్స్ ప్యానెల్‌కి అఫిడవిట్ సమర్పించారు, ఇందులో మహువా మోయిత్రా తన నుంచి గిఫ్టులు తీసుకుందని వెల్లడించారు. ఎంపీగా ఉన్న మోయిత్రా పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖ నుంచి ఎథిక్స్ కమిటీ నివేదికను కోరింది. ఎథిక్స్ ప్యానెల్ నివేదిక ఆధారంగా పార్లమెంట్ ఆమెపై అనర్హత వేటు వేసింది.

Exit mobile version