Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్.. పిల్లల గుర్తింపుకు సంబంధించిన ఈ సేవ ఆ తేదీ వరకు ఫ్రీ..!

  • బ్లూ ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్
  • పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్
  • 2026 సెప్టెంబర్ 30 వరకు ఉచితం
Blue Aadhaar Card

Blue Aadhaar Card

పిల్లల బ్లూ ఆధార్ (Blue Aadhaar) కార్డుకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ వివరాలను 2026 సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ గడువు ముగిసిన తర్వాత బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ అంటే ఏమిటి?

పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి వేలిముద్రలు (Fingerprints), ఐరిస్ (Iris), ముఖ లక్షణాలు మారుతూ ఉంటాయి. దీంతో చిన్న వయసులో నమోదు చేసిన బయోమెట్రిక్ వివరాలు కాలక్రమేణా సరిపోకపోవచ్చు. అందుకే ఆధార్‌లో నమోదు చేసిన బయోమెట్రిక్ సమాచారాన్ని నిర్దిష్ట వయస్సులో తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని UIDAI సూచిస్తోంది.

బయోమెట్రిక్ అప్‌డేట్ ఎందుకు అవసరం?

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.
పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఉండవు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందవచ్చు.
స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు వంటి విద్యా అవకాశాలను సులభంగా పొందవచ్చు.
ఆధార్ ఆధారిత ధృవీకరణ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి.

బయోమెట్రిక్ అప్‌డేట్ ఎలా చేయాలి?

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం (Aadhaar Seva Kendra) లేదా ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి. అక్కడ అప్‌డేట్ ఫారం నింపాలి. పిల్లల వేలిముద్రలు నమోదు చేయాలి. ఐరిస్ స్కాన్ చేయించాలి. తాజా ఫోటో తీస్తారు. ప్రక్రియ పూర్తైన తర్వాత సాధారణంగా 7 నుంచి 15 రోజుల్లో అప్‌డేట్ చేసిన ఆధార్ వివరాలు నమోదు అవుతాయి. అవసరమైతే కొత్త ఆధార్ లెటర్ కూడా అందుబాటులోకి వస్తుంది.

5 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేక నిబంధనలు

UIDAI నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల లోపు పిల్లలకు జారీ చేసే బ్లూ ఆధార్ కార్డులో పిల్లల బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయరు. ఈ ఆధార్ కార్డు తల్లిదండ్రుల ఆధార్ వివరాల ఆధారంగా జారీ చేస్తారు. పిల్లల ఆధార్ నమోదు సమయంలో తల్లిదండ్రుల్లో ఒకరి బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి. OTP ఆధారిత ధృవీకరణ పూర్తి చేయాలి. e-KYC ప్రక్రియ పూర్తి చేయాలి.

సమర్పించాల్సిన పత్రాలు

పిల్లల ఆధార్ నమోదు లేదా అప్‌డేట్ సమయంలో తల్లిదండ్రులు ఈ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

పిల్లల జనన ధృవీకరణ పత్రం లేదా పుట్టిన తేదీకి సంబంధించిన ఆధారం.
పిల్లలతో ఉన్న సంబంధాన్ని నిర్ధారించే పత్రం.
తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు.

గడువులోగా అప్‌డేట్ చేయాలని సూచన

UIDAI ప్రకటించిన ఉచిత బయోమెట్రిక్ అప్‌డేట్ సదుపాయం 2026 సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత బయోమెట్రిక్ అప్‌డేట్‌కు నిర్ణీత రుసుము వర్తించే అవకాశం ఉంది. అందువల్ల 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు గడువు ముగిసేలోపు ఈ సేవను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.