ఇండియన్ రైల్వేస్ (IR) చరిత్రలో మరో మైలురాయి. జూన్ 1, 2026 నుండి ఇండియన్ రైల్వేస్ అధికారిక లోగోలో 18 నక్షత్రాలు చేర్చనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 17 నక్షత్రాల స్థానంలో ఈ మార్పు జరగనుంది. ఈ మార్పుకు కారణం ఏమిటంటే.. భారతదేశంలో దక్షిణ తీర రైల్వే జోన్ (South Coast Railway – SCoR) అనేది 18వ జోనల్ రైల్వేగా జూన్ 1, 2026 నుండి అమలులోకి వస్తోంది. దీని ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ లోగోలోని నక్షత్రాలు దేశంలోని జోనల్ రైల్వేల సంఖ్యను సూచిస్తాయి.
కాబట్టి కొత్త జోన్ ఏర్పాటుతో లోగోను అప్డేట్ చేయాల్సి వచ్చింది. అన్ని రైల్వే స్టేషన్లు, కార్యాలయాలు, రైలు టికెట్లు, అధికారిక వెబ్సైట్లు, యాప్లు, యూనిఫాంలు, లెటర్హెడ్లు మొదలైన అన్ని ప్రదేశాల్లో కొత్త 18 నక్షత్రాల లోగో ఉపయోగించనున్నారు. ఈ మార్పు భారత రైల్వేల అభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యతకు ఒక సంకేతం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
SCoR గురించి కొన్ని ముఖ్యాంశాలు
ప్రధాన కార్యాలయం: విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
ఏర్పాటు తేదీ: జూన్ 1, 2026
జోన్ సంఖ్య: 18వ జోన్
ఇంతకు ముందు 17 జోన్లు మాత్రమే ఉండేవి
విజయవాడ, గుంటూరు, గుంటకల్ డివిజన్లు (సౌత్ సెంట్రల్ రైల్వే నుండి), విశాఖపట్నం డివిజన్ (పాక్షికంగా) దీనికి చేర్చబడ్డాయి
రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్ ప్రకటన
ఏప్రిల్ చివరి వారంలో విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ డిమాండ్ ఇప్పుడు నెరవేరింది.
