NTV Telugu Site icon

Bharat Bandh: ఎస్సీ వర్గీకరణపై కొనసాగుతున్న ఆందోళన- ఉద్రిక్తతలకు దారి తీసిన భారత్ బంద్..!

Bihar Protest

Bihar Protest

Bharat Bandh: ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను సైతం అడ్డుకున్నారు. జాతీయ రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని చెప్పుకొచ్చింది. కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని అత్యున్నత న్యాయం స్పష్టం చేసింది. దీనిపై 2004లో ఐదుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తుత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.

Read Also: ISRO: 30 సంవత్సరాల రిమోట్ సెన్సింగ్ డేటాను పబ్లిక్‌ చేయనున్న ఇస్రో..

కాగా, దీన్ని నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి నాయకులు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై రాష్ట్రాలు ముందుకు వెళ్లకూడదంటూ డిమాండ్ చేస్తోన్నారు. రిజర్వేషన్లల్లో ఇప్పుడు ఉన్న కోటాను యథాతథంగా కొనసాగించాలన్నారు. ఇందులో ఎలాంటి మార్పులూ చేయకూడదని మాల సామాజిక వర్గానికి చెందిన శ్రేణులు పట్టుబట్టారు. అయితే,ఉత్తరాది రాష్ట్రాలపై భారత్ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నిరసనకారులు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తోన్నారు.

Read Also: LION KING: ‘ముఫాసా ది లయన్ కింగ్’ కోసం టాలీవుడ్ కింగ్..

అలాగే, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బిహార్‌లోని జెహనాబాద్‌లో నిరసనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. ఫలితంగా పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మాల సామాజిక వర్గం నేతలను నిలువరించడంలో పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.. దీంతో రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి నాయకులు, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఇక, పోలీసులతో మాల సామాజిక వర్గం నేతలు వాగ్వివాదానికి దిగారు. ఈ బంద్‌కు భీమ్ సేన్ ఆర్మీ, జైభీమ్ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. దీంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.. దేశ రాజధాని ఢిల్లీలోనూ అంతంత మాత్రంగానే భారత్ బంద్ ప్రభావం కనిపిస్తుంది. ఇక, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు యధాతథంగా పనులను కొనసాగుతున్నాయి.