Gujarath: ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూళ్లలో ప్రత్యేక సబ్జెక్టుగా భగవద్గీత

గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో భగవద్గీతను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని తెలియజేసేందుకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను బోధిస్తామని విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ వెల్లడించారు. 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు పుస్తకాల్లో కథ, పారాయణ రూపంలో.. 9 నుంచి 12వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్‌గా భగవద్గీతను ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు గుజరాత్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రార్థనా కార్యక్రమంలో భగవద్గీత పారాయణాన్ని చేర్చాలని మంత్రి జీతూ వాఘానీ సూచించారు. అటు పాఠశాలల్లో భగవద్గీత ఆధారంగా శ్లోకం, వక్తృత్వం, నాట్యం, క్విజ్, నిబంధ్ వంటి వివిధ కాంపిటేషన్, సృజనాత్మక పోటీలను నిర్వహించాలని తెలిపారు. ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. ఇప్పటికే విద్యను కాషాయమయం చేయాలని బీజేపీ భావిస్తోందని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

https://ntvtelugu.com/tirumlala-arjitha-seva-tickets-will-release-on-march-20th/