Site icon NTV Telugu

Budaun Double Murder: చిన్నారుల హత్య కేసులో ఏం తేలిందంటే..!

Murder

Murder

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదౌన్ డబుల్ మర్డర్ కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను ఓ బార్బర్ అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు.

గర్భవతిగా ఉన్న తన భార్యకు డెలివరీ ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఇవ్వాలంటూ నిందితుడు సాజిద్‌.. పరిచయస్తుడైన వినోద్‌ ఇంటికి మంగళవారం సాయంత్రం వెళ్లాడు. ఆ డబ్బులు అప్పుగా ఇచ్చేందుకు వినోద్‌ భార్య సంగీత అంగీకరించింది. అయితే ఆమె లోపలికి వెళ్లినప్పుడు.. ఇంట్లో ఆడుకుంటున్న ఆమె కుమారుడు ఆయుష్‌ (12)ను సాజిద్‌ మేడపైకి తీసుకువెళ్లి కత్తితో పొడిచి చంపాడు. ఆయుష్‌ సోదరులైన అహాన్‌(7), పియూష్‌(6) అదే సమయంలో అక్కడికి రావడంతో వారిపైనా దాడికి తెగబడ్డాడు. వీరిలో అహాన్‌ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పియూష్‌ మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ పరిణామంతో స్థానికులు, చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

పిల్లలను చంపిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారై సమీప అడవుల్లోకి వెళ్లిపోయాడు. అక్కడ పోలీసులకు తారసపడి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కోపోద్రిక్తులైన స్థానికులు.. సాజిద్‌ దుకాణాన్ని తగలబెట్టారు.

స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారుల మ‌‌ృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అలాగే హత్యకు గల కారణాలను కూడా అన్వేషిస్తున్నారు. తాజాగా నిందితుడు సాజిద్ సోదరుడు గౌరవ్ కుమార్ బిష్ణోయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో అతన్ని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై లోతుగా విచారిస్తున్నారు. నిందితుడి సోదరుడి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

మరోవైపు చిన్నారులకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు పోలీసులకు అందింది. ఇద్దరు పిల్లలు, ఆయుష్, అహాన్‌లకు వీపు, ఛాతీ, కాళ్ళపై 14 దెబ్బలు, 23 కత్తిపోట్లు ఉన్నట్లుగా తేలింది. 23 కత్తిపోట్లు శరీరంపై బలంగా ఉన్నాయని రిపోర్టులో తేలింది. ఈ కారణం చేతనే ఇద్దరు చిన్నారులు చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందన్న అంశంపై దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి సోదరుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. అతని నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. ఇదిలా ఉంటే పాత కక్షలతోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అసలేం జరిగిందో తెలియాలంటే నిందితుడి సోదరుడు ఏం చెబుతాడో చూడాలి. నిందితుడి బార్చర్ షాపు.. బాధిత కుటుంబం నివసించే దగ్గరే ఉంది.

 

Exit mobile version