Site icon NTV Telugu

Pahalgam Terror Attack: ఉగ్ర దాడిలో మరో వైమానిక దళ సభ్యుడు మృతి.. భార్యతో ఉండగా..!

Pahalgamterrorattack99

Pahalgamterrorattack99

పహల్గామ్ దాడిలో మరో భారత వైమానిక దళ సభ్యుడు కార్పోరల్ తేజ్ హైల్యాంగ్ (30) చనిపోయాడు. సెలవుల్లో భార్యతో కలిసి కాశ్మీర్‌లోని పహల్గామ్ వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో భార్యతో కలిసి విహరిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ దాడిలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని జిరోల్‌లోని తాజాంగ్ గ్రామానికి తేజ్ హైల్యాంగ్ ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం ఈయన శ్రీనగర్‌లోని భారత వైమానిక దళ స్థావరంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: బాధిత కుటుంబాలతో అమిత్ షా భేటీ.. అండగా ఉంటామని హామీ

తేజ్ హైల్యాంగ్ మృతి పట్ల అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు సంతాపం తెలిపారు. తేజ్ హైల్యాంగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. భార్యతో ఉండగా ఉగ్రవాదులు ప్రాణాలు తీయడం విచారకరమన్నారు. దేశం కోసం ధైర్యంగా, గౌరవంగా సేవ చేశారని గుర్తుచేశారు. ఈ మరణవార్త కుటుంబ సభ్యులకు తీరని లోటు అన్నారు. దు:ఖ సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని.. ఓదార్పు ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack : క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం.. మహేశ్ బాబు, విజయ్..

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. 5-7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి చేసింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఈ ఉగ్రవాదులంతా కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. మహిళలు, పిల్లల్ని ఏమి చేయలేదు. వారి జోలికి కూడా రాలేదు. ఒకవేళ అడ్డొచ్చినా.. ఏమీ చేయలేదు. ఇక ముస్లిమా? కాదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నాకే కాల్చారు. ఐడీ కార్డులో పేరు చూసి మరీ కాల్చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది మరణించారు. యూఏఈ, నేపాల్‌కు చెందిన ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: BJP MPs: ” ఇది పాకిస్థాన్‌ పనే” ఉగ్రవాద ఘటనపై బీజేపీ ఎంపీల రియాక్షన్..

Exit mobile version