NTV Telugu Site icon

వ్యాక్సిన్ల‌పై ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు

Randeep Guleria

క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. అయితే, వ్యాక్సిన్ల కొర‌త భార‌త్‌ను వెంటాడుతూనే ఉంది… పేరు మాత్రం ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సినేష‌న్ ప్రారంభం అయినా.. వ్యాక్సిన్ల కొర‌త‌తో అది పూర్తిస్థాయిలో కార్య‌రూపం దాల్చిందిలేదు.. ఈ నేప‌థ్యంలో.. వ్యాక్సిన్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎయిమ్స్ డైరెక్ట‌ర్ గులేరియా.. రానున్న 2 నెలల్లో భారీ మొత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.. భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. కొత్త ప్లాంట్లు పెడుతున్నాయ‌న్న ఆయ‌న‌.. జులై-ఆగస్టు నాటికి భారీ సంఖ్యలో డోసులు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.. వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు.. ఇదే స‌మ‌యంలో.. విదేశాల నుంచి కూడా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నామ‌ని.. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌, స్పుత్నిక్-వి వ్యాక్సిన్ల ఉత్పత్తి దేశంలో చాలా ప్లాంట్లలో జరుగుతుంద‌న్నారు. స్పుత్నిక్-వి దేశంలోని అనేక సంస్థలతో తయారీ ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టు చెప్పుకొచ్చారు డాక్ట‌ర్ గులేరియా.. అంటే.. మ‌రో రెండు నెల‌ల్లో వ్యాక్సిన్ల కొర‌త‌కు పూర్తిగా చెక్‌పెట్టే విధంగా ప్లాన్ జ‌రుగుతోంది అనేది స్ప‌ష్టం అవుతోంది.