Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన

  • సీజేపీ వాలంటీర్ల సమావేశానికి పర్మిషన్ నో
  • బీజేపీపై సీజేపీ అధ్యక్షుడు దీప్కే ఆరోపణలు
  • త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం అవుతుందని వెల్లడి
Abhijeet Dipke

Abhijeet Dipke

త్వరలోనే జంతర్ మంతర్-2 నిరసన ప్రారంభం అవుతుందని సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దిప్కే ప్రకటించారు. ఢిల్లీలో పార్టీ వాలంటీర్ల సమావేశానికి హాలు కేటాయించనందుకు బీజేపీపై అభిజీత్ దిప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ సమావేశం జరగకుండా ఒత్తిడి చేశారని, చివరికి బుక్ చేసిన హాలు యజమానులను బెదిరించారని ఆరోపించారు. ‘‘చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో జంతర్ మంతర్ సీజన్ 2 ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. కాబట్టి నేను వారికి చెప్పేది ఏమిటంటే జంతర్ మంతర్ సీజన్ 2 చాలా త్వరలో ప్రారంభం కాబోతోంది.’’ అని అన్నారు.

‘‘మేము ఈరోజు ఢిల్లీలో ఒక వాలంటీర్ల సమావేశం నిర్వహించాల్సి ఉంది. దాని కోసం మేము ఒక హాల్ వెతుకుతున్నాం. కానీ ఎవరూ అద్దెకు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ప్రతిచోటా పైనుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. ఎంతో కష్టపడి సీజేపీ ఒక హాలును బుక్ చేసుకుందని.. అందుకు సంబంధించిన రసీదు కూడా పార్టీ దగ్గర ఉందని పేర్కొన్నారు. అయితే మంగళవారం ఉదయం హాలు యజమానులకు బెదిరింపులు వచ్చాయి. ‘‘సీజేపీ సమావేశం అక్కడ జరగడానికి అనుమతిస్తే.. వారిని తలకిందులుగా వేలాడదీస్తామని హాలు యజమానులను బెదిరించారు. ఇదంతా బీజేపీయే చేస్తోంది.’’ అని ఆరోపించారు.

ఇలాంటి చర్యలు దేశ యువత అంటే బీజేపీకి భయంగా ఉందని స్పష్టంగా చూపిస్తున్నాయని దీప్కే అన్నారు. ‘‘ఇలాంటి చిన్న చిన్న చర్యలకు మేము భయపడతామని వారు అనుకుంటే.. వారు చాలా పొరపాటు పడుతున్నారు.’’’ అని అన్నారు. అయితే హాల్ బుకింగ్‌ల విషయంలో ఒత్తిడి, బెదిరింపుల గురించి అభిజీత్ దీప్కే చేసిన ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు.