Aadhav Arjuna on Delimitation: తమిళనాడు అసెంబ్లీలో మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తమిళనాడు నుంచి ఒకరు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా సీఎం విజయ్ను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణ భారతం నుంచి ప్రధాని రావాల్సిన అవసరం ఉందని, ఆ అవకాశం తమిళనాడుకు రావాలని అన్నారు. డీలిమిటేషన్ కంటే ‘ఫ్రీజ్ డీలిమిటేషన్’ ముఖ్యమని మంత్రి ఆధవ్ అర్జున పేర్కొన్నారు. లోక్సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 వద్దే కొనసాగించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచినా దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు. 50 శాతం సీట్లు పెంచితే ఉత్తర భారత రాష్ట్రాల ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉందని ఆధవ్ అర్జున ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు నుంచి ఆరు హిందీ రాష్ట్రాలు కలిసి దేశ తదుపరి ప్రధానమంత్రి ఎవరు కావాలో నిర్ణయించే పరిస్థితి ఏర్పడకూడదన్నారు.
తమిళనాడు ప్రయోజనాల కోసం ఐక్యత
డీలిమిటేషన్ విషయంలో తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు ‘ఫ్రీజ్ డీలిమిటేషన్’ అవసరమని స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా చూడటంతో పాటు, భవిష్యత్తులో దక్షిణ భారతం నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి ప్రధానమంత్రి వచ్చే పరిస్థితి ఏర్పడాలని ఆధవ్ అర్జున అభిప్రాయపడ్డారు.
ఆధవ్ అర్జున పేరుతో రూ.8 కోట్ల మోసం యత్నం
ఇదిలా ఉండగా, మంత్రి ఆధవ్ అర్జున పేరును ఉపయోగించి భారీ మోసానికి ప్రయత్నించిన ఘటన చెన్నైలో వెలుగుచూసింది. టీవీకే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పిస్తామని నమ్మించి రూ.8 కోట్లు వసూలు చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. మంత్రి ఆధవ్ అర్జునతో తమకు పరిచయం ఉందంటూ నిందితులు టీవీకే ఎమ్మెల్యేను నమ్మించే ప్రయత్నం చేశారు. మంత్రి పేరుతో నకిలీ ఈమెయిల్, పలు నకిలీ పత్రాలను సృష్టించి మంత్రి పదవి ఇప్పిస్తామని ఆఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అనుమానం వచ్చిన ఎమ్మెల్యే నిందితులతో వీడియో కాల్ మాట్లాడటంతో వ్యవహారం బయటపడింది. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో రూపన్ రాజ్, శక్తి అర్జున్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, కంప్యూటర్ సీపీయూను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఈమెయిల్, పత్రాల తయారీ, మోసపూరిత ఆఫర్ వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

