5 Cops Suspended For Stealing Diesel From Police Vehicles In Madhya Pradesh: దొంగతనాలు, దోపిడీల నుంచి ప్రజలను పోలీసులు రక్షిస్తుంటారు. ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ఏదైనా అన్యాయం జరిగితే ముందుగా సామాన్యుడు ఆశ్రయించేది పోలీసులనే. అయితే అలాంటి పోలీసులే దొంగతనానికి పాల్పడితే.. నిజంగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఏకంగా సొంత పోలీస్ వాహనాల నుంచే డీజిల్ దొంగిలించారు. పోలీస్ వాహనాల నుంచి డీజిల్ దొంగతనం చేస్తే తెలియదని అనుకున్నారేమో కానీ చివరకు దొంగతనం బయటపడింది.
Read Also: Himanta Biswa Sarma: మా తల్లుల గర్భం ఏమైనా వ్యవసాయ స్థలమా..? హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై ఫైర్
మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో పోలీస్ వాహనాల నుంచి ఇద్దరు పోలీసులు డీజిల్ దొంగలించారు. దొంగతనం వెలుగులోకి రావడంతో ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లతో సహా మొత్తం ఐదుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నవంబర్ 30న మూడు పోలీస్ వాహనాల్లో నుంచి 250 లీటర్ల డీజిల్ దొంగిలించబడింది. విచారణలో ఇద్దరు కానిస్టేబుళ్లే ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. దీంతో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లపై కేసు నమోదు అయింది. సోమవారం ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ నిషా రెడ్డి తెలిపారు.
