NTV Telugu Site icon

Tamil Nadu: ప్రాణాలు తీసిన నూడుల్స్.. తిని నిద్రలోనే చనిపోయిన బాలిక

Tamilnadunoodles

Tamilnadunoodles

చిన్న పిల్లలు నూడుల్స్ అనగానే లొట్టలేసుకుంటారు. అంతగా వాళ్లు దాన్ని ఇష్టపడి తింటారు. పైగా క్షణాల్లో తయారు కావడం.. తక్కువ ధరలోనే దొరకడంతో పిల్లలు నూడుల్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అదే ఆ బాలిక పాలిట శాపమైంది. స్కూల్ నుంచి రాగానే.. ఆకలి తీర్చుకునేందుకు నూడుల్స్ రెడీ చేసుకుని తింది.. తిన్న కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ హఠాత్తు మరణంపై దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలను అన్వేసిస్తున్నారు.

 

తమిళనాడులోని తిరుచ్చిలో 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని తన ఇంట్లోనే నూడుల్స్ తయారు చేసి తిన్న తర్వాత శవమై కనిపించింది. బాలిక ఆన్‌లైన్‌లో ‘బుల్డాక్ నూడుల్స్’ ఆర్డర్ చేసింది. తయారు చేసుకుని తిన్న తర్వాత ప్రాణాలు వదిలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. బాలిక మరణానికి గల కారణాలపై అన్వేసిస్తున్నారు. అలాగే పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు తిరుచ్చిలోని నూడుల్స్ హోల్‌సేల్ వ్యాపారులపై దాడి చేసి 800 కిలోల గడువు ముగిసిన చైనీస్ నూడిల్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆగస్టు 31న శనివారం రాత్రి మైనర్ బాలిక ‘బుల్డాక్ నూడుల్స్’ లేదా ‘బుల్ డాగ్ నూడుల్స్’ తయారు చేసి తిన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం కూల్‌డ్రింక్ తాగి నిద్ర పోయింది. మరుసటి రోజు ఆమె ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించింది. సెప్టెంబర్ 1న ఆదివారం ఉదయం తల్లిదండ్రులు గమనించి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ బాలిక అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు గుర్తించారు.

ఘటన అనంతరం బాలిక అంత్యక్రియలు చేసేందుకు కుటుంబీకులు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరియమంగళం పోలీసులు కేసు నమోదు చేసి బాలిక శవపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. బాలిక గొంతులో నూడుల్స్ ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.