Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్

Yadhu Vamsi

Yadhu Vamsi

Yadhu Vamsi: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ చిత్రానికి పనిచేసిన మేకప్ విభాగం కూడా విశేష గుర్తింపు పొందింది. ఉత్తమ మేకప్ మెన్ విభాగంలో ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ అవార్డుల ప్రకటనతో చిత్రబృందం ఆనందంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ యదు వంశీ విజయాన్ని చూసి ఆయన తండ్రి భావోద్వేగానికి గురైన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా తన కుమారుడు విజయాన్ని చూడాలని ఎదురుచూసిన తండ్రి, ఇప్పుడు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడిగా యదు వంశీని గర్వంగా చూస్తున్న దృశ్యాలు నెటిజన్లను కదిలిస్తున్నాయి.

“నేషనల్ అవార్డు గ్రహీత, పూర్ణ గణపతి గారి అబ్బాయి.. మొట్ట మొదటి సినిమాతో సంచలనం సృష్టించిన యదు వంశీ అంటూ” భావోద్వేగంతో యదు వంశీ గారి తండ్రి పలికిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక తండ్రికి తన కుమారుడు విజయం సాధించడాన్ని చూడటం కంటే గొప్ప ఆనందం ఏముంటుంది అని అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ హృదయాన్ని హత్తుకునే క్షణాలను చూసి పలువురు సినీ ప్రముఖులు కూడా చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలోని కథ, కొత్త నటీనటుల అద్భుత నటన, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘కమిటీ కుర్రాళ్లు’ ఇప్పుడు జాతీయ అవార్డు సాధించడం ద్వారా తన విజయాన్ని మరోసారి చాటుకుంది. ఈ అవార్డు యదు వంశీతో పాటు మొత్తం చిత్రబృందం కష్టానికి దక్కిన గొప్ప గుర్తింపుగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.