Ramayan: ఇండియన్ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘రామాయణం’. సుమారు రూ.4,800 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అయితే రిలీజ్ కు ముందే ఈ మూవీ భారీ చర్చకు దారి తీస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ స్కేల్తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమా తారాగణం పారితోషికాలపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇందులో ఒక స్టార్ నటుడు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా చేసిన నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం రణబీర్ కపూర్ మొత్తం రూ.150 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఒక్కో భాగానికి రూ.75 కోట్లు అందుకుంటున్నారని సమాచారం.
అయితే ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. తనకు ఎలాంటి పారితోషికం అవసరం లేదని నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెప్పినట్లు స్వయంగా వివేక్ వెల్లడించారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు రావాల్సిన మొత్తం పారితోషికాన్ని క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తాను ఈ సినిమాని ఒక సినిమా కోణంలో కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నానని వివేక్ ఒబెరాయ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ప్రాజెక్ట్లో భాగం కావడమే తనకు పెద్ద గౌరవమని, పారితోషికం కంటే సేవా కార్యక్రమానికి ఆ నిధులు వెళ్తే మరింత సంతోషంగా ఉంటుందని చెప్పారు.
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 నవంబర్ 6న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రైలర్కు మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, వివేక్ ఒబెరాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

