Dhanush: రాజకీయాలపై ఊహాగానాల వేళ.. కుమారులతో ధనుష్ ప్రత్యేక పూజలు.. అసలేం జరుగుతోంది?

Dhanush3

Dhanush3

Dhanush: తమిళ సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ పేరు ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అలాంటి సమయంలో ధనుష్ తన ఇద్దరు కుమారులు లింగ, యాత్రలతో కలిసి తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అన్నామలై ఆలయాన్ని సందర్శించడం ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. ఈ దర్శనం ఆధ్యాత్మిక యాత్రేనా, లేక మరో సంకేతమా అనే ప్రశ్న అటు అభిమానుల్లో ఇటు సినీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ధనుష్ తన ప్రతిష్టాత్మక మూవీ ‘ఓం చాప్టర్ 1’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ తిరువణ్ణామలై పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా, షూటింగ్‌కు విరామం తీసుకున్న ఆయన ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ధనుష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు కుమారులు లింగ, యాత్ర కూడా ఆలయ దర్శనంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక ధనుష్ ఆలయానికి వచ్చిన విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆలయం వెలుపల ఆయనను ఒక్కసారి చూడాలని అభిమానులు పోటీపడగా, సెల్ఫీలు, వీడియోల కోసం భారీగా గుమిగూడారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ధనుష్ తన కారువరకు చేరుకోవడమే కష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా ఆయన ఇదే ఆలయాన్ని సందర్శించినప్పుడు ఇలాంటి స్పందనే కనిపించింది.

ఇటీవల చెన్నైలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ధనుష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు కారణమయ్యాయి. అభిమాన సంఘాలు సినిమా వేడుకలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో నక్షత్రం గుర్తుతో పాటు ‘ఎన్నంపోల్ వాజ్కై’ అనే నినాదంతో ఎరుపు, తెలుపు రంగుల్లో రూపొందిన జెండా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే ఈ అంశంపై ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇక సినిమాల విషయానికి వస్తే, ‘ఓం చాప్టర్ 1’ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ‘అమరన్’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న ఆయన నుంచి వస్తున్న కొత్త ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ చిత్రంలో మమ్ముట్టి, శ్రీలీల, సాయి పల్లవి, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో 26 సంవత్సరాల తర్వాత నసీరుద్దీన్ షా తమిళ సినిమాకు తిరిగి వస్తుండటం విశేషం.

ఈ సినిమాను ధనుష్ తన వండర్‌బార్ ఫిల్మ్స్ సంస్థతో పాటు శ్రద్ధా అగర్వాల్‌కు చెందిన ఆర్ టేక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. కథను గోప్యంగా ఉంచినప్పటికీ, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తుతో మరో కొత్త చిత్రానికి ధనుష్ సిద్ధమవుతుండగా, వెట్రిమారన్‌తో మరో ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది.

ఒకవైపు వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకెళ్తూనే, మరోవైపు రాజకీయాలపై వస్తున్న ఊహాగానాల మధ్య ధనుష్ చేపడుతున్న ప్రతి పని ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. ఆలయ దర్శనం పూర్తిగా వ్యక్తిగత యాత్రేనా, లేక భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి ముందు కనిపిస్తున్న సంకేతమా అన్నది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.