ప్రముఖ కథ, మాటల రచయిత దివాకర బాబు మాడభూషి ‘చూడాలని వుంది, శుభలగ్నం, మావిచిగురు, యమలీల’ వంటి సుమారు వంద చిత్రాలకు పనిచేశారు. ఆయన కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించి పలు చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. దివాకరబాబు తనకున్న అనుభవంతో రాసిన ‘ఒలికిపోయిన వెన్నెల’ నవలను సినీ మ్యాక్స్ లో ఇటీవల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దివాకర బాబు మాట్లాడుతూ ”వెన్నెల చాలా హాయిగా, ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ ఆ వెన్నెల ఒలికిపోతే ఎవరికి అవసరం లేదు. ఎవరూ దాన్ని ఎత్తుకుని దోసిళ్లలోకి తీసుకోలేరు. ఇదే పాయింటును ఒక స్త్రీ పరంగా చెబుతూ, ఒక స్త్రీ యొక్క అంతరంగ మథనాన్ని ఈ ‘ఒలికి పోయిన వెన్నెల’ నవలలో ఆవిష్కరించడం జరిగింది. దర్శకేంద్రుడు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా విన్నపాన్ని మన్నించి ఈ నవలను ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు” అని అన్నారు.
