The Vvaan: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, స్టార్ బ్యూటీ తమన్నా భాటియా, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాలు కలిసి నిన్న (2026 సెప్టెంబర్ 19న) బీహార్లోని పాట్నా సమీపంలో ఉన్న 400 ఏళ్ల నాటి ప్రసిద్ధ ‘వాన్ దేవి మహాధామ్’ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే తమ పీరియడ్ సైన్స్-ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా ‘ది విహ్వాన్’ (The Vvaan) 2026 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా, ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ ఈ ఆధ్యాత్మిక పర్యటన చేసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రాలను చూడటానికి స్థానిక ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ ప్రాంతం అంతా కోలాహలంగా మారింది.
ఈ 400 ఏళ్ల నాటి పురాతన వాన్ దేవి ఆలయ క్షేత్ర మహత్యం, అక్కడి స్థానిక నమ్మకాలు, పవిత్రమైన ఛత్ పూజ పండుగ నేపథ్యాల ఆధారంగానే ‘ది విహ్వాన్’ సినిమా కథను రూపొందించడం విశేషం. ఈ ఆలయం చుట్టూ ఉన్న అడవి బ్యాక్డ్రాప్లో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వీటినే ఇప్పటికీ అక్కడ కథలు, కథలుగా చెప్పుకుంటారు. ఈ గుడిలో దేవుడి విగ్రహం కూడా ఉండదు, కేవలం ఒక పవిత్రమైన రాతి శిలను అడవి దేవతగా ఇక్కడి ప్రజలు పూజిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఈ ఆలయంలో ఎవరూ ఉండకూడదనే నియమం కూడా ఉంది. సినిమా షూటింగ్కు ముందే ఇక్కడి కథను రీసెర్చ్ చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు రిలీజ్కు ముందు దేవుడి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి చేరుకుంది.
ఈ పూజల అనంతరం తమన్నా భాటియా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ 400 ఏళ్ల నాటి పవిత్రమైన వాన్ దేవి ఆలయాన్ని సందర్శించడం నా జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమా కథకు పునాది అయిన ప్రదేశంలోనే నిలబడి పూజలు చేయడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. అంతేకాదు బీహార్ సంప్రదాయం ప్రకారం మేము చేసిన ‘కోసి భర్నా’ ఛత్ పూజ ఆచారం నా హృదయాన్ని తాకింది” అంటూ తమన్నా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పాట్నాలోని ప్రసిద్ధ మహావీర్ మందిర్ను కూడా సందర్శించిన ఈ టీమ్, మెరైన్ డ్రైవ్ వద్ద జరిగిన గంగా హారతిలో పాల్గొని సందడి చేశారు.
ఇక ‘ది విహ్వాన్’ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ నాస్తికుడి పాత్రలో కనిపించనున్నారు. తన పూర్వీకుల గ్రామానికి తిరిగి వచ్చిన అతను నిషేధిత అడవిలోకి అడుగుపెట్టడంతో అక్కడ దాగి ఉన్న ఓ మర్మమైన దైవిక శక్తి మేల్కొంటుంది. ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు, ప్రేమ, దైవిక శక్తి చుట్టూ కథ ముందుకు సాగుతుంది. ఇందులో సిద్ధార్థ్కు జోడీగా తమన్నా భాటియా నటిస్తోంది. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శోభా కపూర్, ఏక్తా కపూర్, అరుణాభ్ కుమార్, నీరజ్ కొఠారి నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నాతో పాటు మనీష్ పాల్, సునీల్ గ్రోవర్, శ్వేతా తివారీ, అనూప్ సోని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పురాతన జానపద కథ, దైవిక శక్తి, అడవి రహస్యం కథతో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఏక్తా కపూర్, తమన్నా, సిద్ధార్థ్ స్వయంగా వన్ దేవి ఆలయాన్ని సందర్శించడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది

