Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!

Shakeela (1)

Shakeela (1)

Shakeela: ఒక చిన్న అలవాటు జీవితాన్ని ఎంత పెద్ద సమస్యలోకి నెట్టేస్తుందో నటి షకీలా చెప్పిన తాజా అనుభవం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. గంటల తరబడి మొబైల్ ఫోన్ వాడటం, తప్పు భంగిమలో పడుకుని వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటమే తనకు తీవ్ర ఆరోగ్య సమస్యకు కారణమైందని ఆమె వెల్లడించారు. ఈ సమస్య కారణంగా రూ.3 లక్షల వ్యయంతో మెడ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పడంతో పాటు, మొబైల్ వినియోగంపై అభిమానులకు గట్టి హెచ్చరిక కూడా చేశారు.

ఇటీవల శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న షకీలా, మెడకు కాలర్ ధరించి ఒక వీడియో విడుదల చేశారు. అందులో తన ఈ పరిస్థితికి ఎలా చేరుకున్నానో బహిరంగంగా పంచుకున్నారు. తాను ఒక పక్కకు తిరిగి పడుకుని గంటల తరబడి ఫోన్‌లో గేమ్స్ ఆడేదాన్నని, యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ సమయం గడిపేదాన్నని చెప్పారు. మధ్యలో టీ లేదా కాఫీ కోసం మాత్రమే లేచి, మళ్లీ అదే అలవాటును కొనసాగించేదాన్నని ఆమె వివరించారు.

ఈ అలవాటు కారణంగా మెడలోని నరాలపై తీవ్ర ప్రభావం పడిందని షకీలా చెప్పారు. మొదట చిన్న అసౌకర్యంగా కనిపించిన సమస్య క్రమంగా తీవ్రమై చివరకు పెద్ద శస్త్రచికిత్స వరకు వెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న సమయంలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇతరుల సహాయం అవసరమవుతోందని ఆమె వెల్లడించారు. ఈ అనుభవం తర్వాతే మొబైల్ వినియోగాన్ని ఎంత జాగ్రత్తగా చూడాలో తనకు అర్థమైందని అన్నారు.

తన అనుభవాన్ని చెబుతూ షకీలా ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. ఫోన్ ఉపయోగకరమైన పరికరమే అయినప్పటికీ, అవసరానికి మించి వాడకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లలకు చిన్న వయసులోనే గాడ్జెట్లు ఇచ్చి గంటల తరబడి వాటిలో మునిగిపోయేలా చేయవద్దని తల్లిదండ్రులను కోరారు. అవసరమైన విషయాలకే ఫోన్ వాడాలని, అనవసరంగా వీడియోలు చూస్తూ గంటల తరబడి గడపడం మానుకోవాలని సూచించారు.

ఇక షకీలా సినీ ప్రయాణం కూడా ప్రత్యేకమే. 1990వ దశకంలో సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమె, 2000లో విడుదలైన ‘కిన్నరతుంబికల్’తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా విజయం తర్వాత కేరళలో “షకీలా వేవ్”గా పిలిచే స్థాయిలో ఆమెకు ప్రజాదరణ లభించింది. ఆ తర్వాత మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.

తరువాతి కాలంలో బోల్డ్ పాత్రల నుంచి దూరమై, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కెరీర్‌ను కొనసాగించారు. ‘చోటా ముంబై’, ‘తేజా భాయ్ అండ్ ఫ్యామిలీ’, ‘జయం’, ‘తొట్టి గ్యాంగ్’, ‘బంగారం’, ‘అళగీయ తమిళ మగన్’, ‘బాస్ ఎంగిర భాస్కరన్’, ‘మధ గజ రాజా’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ఇప్పుడు తన హెల్త్ అప్డేట్ ను బహిరంగంగా పంచుకోవడం ద్వారా, ఒక సాధారణ అలవాటు కూడా ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో షకీలా అందరికీ గుర్తు చేశారు. డిజిటల్ ప్రపంచంలో ఎక్కువ సమయం గడుపుతున్న ఈ తరం కోసం ఆమె చెప్పిన హెచ్చరిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.