Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు సంబంధించిన 1998 కృష్ణజింకల వేట కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం కోర్టు కేసు కాదు, ఆ ఘటన ఆధారంగా రూపొందుతున్నట్లు ప్రచారం పొందిన ‘బ్లాక్ బక్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ’ సినిమా. టీజర్ విడుదలైన కొద్ది రోజులకే ఈ మూవీ వివాదానికి దారితీయగా, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. చిత్ర నిర్మాత అమిత్ జానీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైన వెంటనే, అది తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ సల్మాన్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, టీజర్తో పాటు సినిమాకు సంబంధించిన సోషల్ మీడియా లింకులను యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికల నుంచి తొలగించాలని నిర్మాతలకు ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం సల్మాన్కు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించింది.
విచారణ సందర్భంగా నిర్మాత అమిత్ జానీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన అమిత్ జానీ తరపు న్యాయవాది, సినిమాలో ఎక్కడా సల్మాన్ ఖాన్ పేరును ప్రస్తావించలేదని వాదించారు. అయితే సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాదులు మాత్రం భిన్నమైన వాదనలు వినిపించారు. సల్మాన్ పేరును ప్రత్యక్షంగా ఉపయోగించకపోయినా, పోస్టర్లు, పాత్రలు, కథాంశం ద్వారా సల్మాన్ ఖాన్ గుర్తింపును స్పష్టంగా ఉపయోగించారని వారు కోర్టుకు వివరించారు. ముఖ్యంగా కృష్ణజింకల కేసు సంబంధిత సంఘటనలను చూపించే విధానం వల్ల నటుడి ప్రతిష్ఠకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ కథనం ఒక వర్గాన్ని సల్మాన్ ఖాన్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రమాదం కూడా ఉందని వాదించారు.
ఈ వివాదానికి ఆరంభం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తోనే జరిగింది. పోస్టర్లో కనిపించిన కథానాయకుడి లుక్ సల్మాన్ ఖాన్ను పోలి ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనంతరం విడుదలైన టీజర్లో కూడా కృష్ణజింకల వేట కేసు, బిష్ణోయ్ సమాజానికి సంబంధించిన సూచనలు ఉండటంతో వివాదం మరింత ముదిరింది. అంతేకాదు ఈ చిత్రాన్ని బిష్ణోయ్ సమాజానికి అంకితం చేస్తున్నట్లు టీజర్లో పేర్కొనడం కూడా చర్చకు కారణమైంది. అయితే వివాదం తీవ్రరూపం దాల్చిన తర్వాత నిర్మాతలు వివరణ ఇచ్చారు. తమ సినిమా ఏ ఒక్క వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని రూపొందించలేదని, ఇది కేవలం కల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమని స్పష్టం చేశారు. అయినప్పటికీ కోర్టు ప్రస్తుతం టీజర్ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది.

