RD Burman Biopic: భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని సరికొత్త మలుపు తిప్పిన అత్యంత ప్రభావవంతమైన సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్. బాలీవుడ్లో అందరూ ప్రేమగా ‘పంచమ్ దా అని పిలుచుకునే ఈయన, ప్రముఖ క్లాసికల్ సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్ కుమారుడు. అంతేకాదు లెజెండరీ గాయని ఆశా భోంస్లే భర్త కూడా. ఆర్.డి. బర్మన్ జీవిత ప్రయాణం1939 -1994వరకు సాగింది. 1960 నుండి 1990 వరకు హిందీ సినిమా సంగీతాన్ని ఏలిన ఆయన, భారతీయ శాస్త్రీయ సంగీతానికి వెస్ట్రన్ మ్యూజిక్ ను జోడించి సరికొత్త ట్రెండ్ను సృష్టించారు. కిషోర్ కుమార్, లతా మంగేష్కర్లతో కలిసి ‘షోలే’, ‘యాదోన్ కీ బారాత్’, ‘అమర్ ప్రేమ్’ ‘1942: ఎ లవ్ స్టోరీ’ వంటి వందలాది సినిమాలకు ఎవర్గ్రీన్ క్లాసిక్ సాంగ్స్ అందించిన పంచమ్ దా, ఇప్పటికీ నేటి తరం మ్యూజిక్ డైరెక్టర్లకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్లో బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ టైటిల్ రోల్ (ఆర్.డి. బర్మన్) పాత్రలో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు నీరజ్ పాండే నేతృత్వంలో ఫ్రైడే ఫిల్మ్వర్క్స్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో, ఆర్.డి. బర్మన్కు అత్యంత సన్నిహితుడైన దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పాత్రలో అక్షయ్ కుమార్ ఒక ప్రత్యేక కామియో రోల్లో కనిపించనున్నారు. అలాగే, బర్మన్ కెరీర్కు లైఫ్ ఇచ్చిన ప్రముఖ హాస్యనటుడు మెహమూద్ పాత్ర కోసం ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా మీద ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడుతోంది.
ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 2026 నుండి ప్రారంభం కానుంది. ఆర్.డి. బర్మన్తో మెహమూద్కు ఉన్న అనుబంధం కేవలం వృత్తిపరమైన పరిచయానికి మాత్రమే పరిమితం కాలేదు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆర్.డి. బర్మన్ ఎదుగుతున్న సమయంలో ఆయనతో కలిసి పనిచేసిన ప్రముఖుల్లో మెహమూద్ కూడా ఒకరు. సంగీత దర్శకుడి ప్రయాణంలో కీలకమైన వ్యక్తిగా ఆయన పాత్రను ఇమ్రాన్ హష్మీ రూపంలో ఎలా చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు అక్షయ్ కుమార్ రాజేష్ ఖన్నా పాత్రలో కనిపించనుండటం కూడా ఈ బయోపిక్కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆర్.డి. బర్మన్ సంగీత ప్రయాణంలో రాజేష్ ఖన్నాతో ఆయనకు ఉన్న అనుబంధం ఎంతో ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో రాజేష్ ఖన్నా, మెహమూద్ వంటి ప్రముఖుల పాత్రలను కథలో ఎలా మిళితం చేస్తారనే విషయం సినిమా కథనానికి కీలకంగా మారనుంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్ మొదలైన తర్వాత మరిన్ని నటీనటుల ఎంపిక, పాత్రల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే మ్యూజిక్ బయోపిక్లలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా మారింది. అక్షయ్ కుమార్ రాజేష్ ఖన్నాగా, ఇమ్రాన్ హష్మీ మెహమూద్గా కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆర్.డి. బర్మన్ ను ఈ బయోపిక్లో ఎలా చూపిస్తారనే ఆసక్తి అయితే అటు సినీ వర్గాలలో, ఇటు సంగీత ప్రియుల్లో కనిపిస్తోంది.

