Ramayana: భారతీయ పురాణ గాథలను ప్రపంచ వేదికపై నిలబెట్టే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. భారీ తారాగణం, పాన్ వరల్డ్ విజన్తో తెరకెక్కుతున్న ‘రామాయణం’ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల దృష్టిని కూడా ఆకర్షిస్తోందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిజంగానే ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ స్టూడియో ద్వారా విడుదల కానుందా? లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా? తాజాగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో వెలుగులోకి వచ్చిన వ్యాఖ్యలు ఈ ప్రశ్నలకు కొత్త కోణాన్ని తీసుకొచ్చాయి.
లాస్ ఏంజిల్స్లో నిర్వహించిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాస చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. డిజిటల్ క్రియేటర్ సబీన్ ఫహీమ్ ఆయనతో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ అంశం మరింత వైరల్ అయింది. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొనగా, భారతీయ సినిమా ప్రభావం, దక్షిణాసియా అమెరికన్ మీడియా పాత్ర, ప్రపంచ ప్రేక్షకులతో మెరుగైన అనుసంధానం వంటి అంశాలు కూడా ఆ చర్చలో ప్రస్తావనకు వచ్చాయి.
ఈ సందర్భంగా డాక్టర్ కె.జె. శ్రీనివాస మాట్లాడుతూ, భారతీయ సినిమాలకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఉన్నప్పటికీ, భారతదేశం సాంస్కృతికంగా ఎంత గొప్పదో, భారతీయ కథలు ఎంత విశాలమైనవో ప్రపంచానికి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆ అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ సినిమాలు ఎప్పటినుంచో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయని, ఇప్పుడు హాలీవుడ్తో భారతీయ చిత్ర పరిశ్రమ సంబంధాలను మరింత బలంగా ప్రపంచానికి తెలియజేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సినిమా కాన్ కార్యక్రమంలో ‘రామాయణం’కు లభించిన స్పందనను కూడా ఆయన గుర్తు చేశారు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, మీడియా ప్రతినిధులతో పాటు జేమ్స్ కామెరాన్ వంటి దిగ్గజ దర్శకులు కూడా పాల్గొన్నారని చెప్పారు. ‘రామాయణం’ను ఎలా ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయాలన్న అంశంపై అక్కడ కనిపించిన ఆసక్తి తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించారు. దీంతో ఈ చిత్రం అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశాలపై చర్చ మొదలైంది.
ఇదే సమయంలో వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ‘రామాయణం’ అంతర్జాతీయ పంపిణీ బాధ్యతలు చేపట్టబోతుందనే ప్రచారం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి స్పందించిన డాక్టర్ శ్రీనివాస, అలాంటి అధికారిక సమాచారం తన వద్ద లేదని స్పష్టం చేశారు. వార్నర్ బ్రదర్స్తో ఒప్పందం కుదిరిందని తాను చెప్పలేనని పేర్కొంటూ, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని కూడా ధృవీకరించలేదు. దీంతో ఈ అంశంపై వస్తున్న వార్తలు ఇప్పటికీ ఊహాగానాల దశలోనే ఉన్నాయని స్పష్టమైంది. మరోవైపు చిత్రబృందం కానీ, వార్నర్ బ్రదర్స్ కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ పౌరాణిక చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్తో పాటు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా, పూర్తి ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. జూలై 23 నుంచి 26 వరకు జరగనున్న కామిక్కాన్ వేదికగా ‘రామాయణం’కు సంబంధించిన ప్రత్యేక విజువల్స్ లేదా కొత్త ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ పురాణ కథలను అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే అరుదైన ప్రయత్నంగా సినీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి చిత్రబృందం నుంచి వచ్చే తదుపరి అధికారిక అప్డేట్పైనే నిలిచింది.

