దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులను, నటులను పరిచయం చేసిన ఆర్బీ చౌదరి మరణం.. ఇండస్ట్రీకి తీరని లోటు. అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ వారి ఇద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.. ‘నేను జైలర్ 2 షూటింగ్లో ఉండగా ఆయన నాకు ఫోన్ చేశారు. తన బ్యానర్లో ఇప్పటివరకు 99 సినిమాలు పూర్తి చేశానని, తన 100వ సినిమా నా (రజనీ) తో తీసి గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలని అనుకుంటున్నట్లు తన కోరికను వెల్లడించారు’ అని రజనీకాంత్ తెలిపారు. అంతేకాకుండా,
ఆ 100వ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రెండు మూడు కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆర్బీ చౌదరి రజనీకాంత్తో చెప్పారట. అందుకు రజనీకాంత్ కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఖచ్చితంగా ఆ సినిమాలో నటిస్తానని మాట ఇచ్చారట. కానీ, ఆ మైలురాయి లాంటి సినిమా పట్టాలెక్కకముందే ఆయన ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమని తలైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బీ చౌదరి ఎప్పుడూ తన పరిమితులు తెలుసుకుని సినిమాలు తీసేవారని, ఎవరితోనూ వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండేవారని రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం విశాల్ హీరోగా రూపొందుతున్న ‘మకుటం’ సినిమా ఆర్బీ చౌదరి గారి 99వ చిత్రంగా నిలిచిపోయింది. ఆయన కలగా మిగిలిపోయిన 100వ సినిమా గురించి రజనీకాంత్ చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో విషాదాన్ని నింపాయి.