Anumana Pakshi: ‘డీజే టిల్లు’ సినిమాతో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ. ఇప్పుడు మరో డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఆయన ఎంచుకున్న కథలో హీరోకు ఉండే అనుమానాలు, గందరగోళమే ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్వించనున్నాయి. రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న ‘అనుమాన పక్షి’ ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్తో ఆసక్తిని పెంచగా.. ఈ రోజు సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.
ఈ పోస్టర్లో సాంప్రదాయ దుస్తులు ధరించి, చేతిలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్న రాగ్ మయూర్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అయితే పోస్టర్లో హీరో లుక్ కంటే అతడి చుట్టూ ఉన్న కాన్సెప్ట్ మరింత ఆసక్తికరంగా ఉంది. ‘డౌట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్’ పేరుతో ఉన్న బ్లాక్బోర్డుపై జీవితం, కర్మ, విధి వంటి విషయాలపై రకరకాల ప్రశ్నలు కనిపిస్తున్నాయి. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే సందేహాలను కామెడిగా తెరపై చూపించబోతున్నారనే విషయం ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. ‘వన్ బాయ్, బిలియన్ థాట్స్, జీరో చిల్’ అనే ట్యాగ్లైన్ కూడా కథానాయకుడి విచిత్రమైన ఆలోచనా విధానాన్ని కూడా చూపిస్తోంది.
‘అనుమాన పక్షి’కి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘డీజే టిల్లు’తో యూత్ను ఆకట్టుకున్న ఆయన.. ఈసారి కూడా సిట్యుయేషనల్ కామెడీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు, విపరీతమైన ఆలోచనలు, అనుమానాలతో ముడిపెట్టి నవ్వులు పూయించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాగ్ మయూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రాగ్ మయూర్ కెరీర్ కు ఈ మూవీ కీలకం కానుంది. ఆయన పోస్టర్ లో కనిపిస్తున్న తీరు చూస్తే.. ఈ సారి కడుపుబ్బ నవ్వించే కామెడీ డబుల్ ఉన్నట్లు అనిపిస్తోంది.
చిలక ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలక, రాజేష్ జగటియాని, హిరాచంద్ దండ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, టీజర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘డీజే టిల్లు’ తరహాలోనే యూత్ను టార్గెట్ చేసే కామెడీ, కొత్త తరహా పాత్రలు, సిట్యుయేషనల్ హ్యూమర్తో ‘అనుమాన పక్షి’ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కామెడీకి భిన్నమైన తాత్విక ప్రశ్నలను జోడించడం సినిమాకు ప్రత్యేకతగా మారనుంది. జీవితం గురించి మనకు వచ్చే చిన్న చిన్న సందేహాలను ఒక వినోదాత్మక కథగా ఎలా మలిచారనేది తెరపైనే చూడాలి.
సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ‘అనుమాన పక్షి’తో విమల్ కృష్ణ మరోసారి తన కామెడీ మార్క్ను చూపిస్తారా, రాగ్ మయూర్ తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను నవ్విస్తారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పోస్టర్లో కనిపిస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్కు తగ్గట్టుగానే సినిమా కూడా కొత్త అనుభూతిని అందిస్తే.. ఈ కామెడీ ఎంటర్టైనర్కు యూత్లో మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది.

