కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రధారులుగా మునిరత్నం నాయుడు, రాజేశ్వరి నిర్మిస్తున్న చిత్రం ‘ఏవం జగత్’. దినేష్ నర్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ చిత్రంలోని ‘రాధాస్ లవ్’ సాంగ్ ని ‘వకీల్ సాబ్’ ఫేమ్ అనన్య నాగళ్ళ విడుదల చేశారు. ‘ఉదయించే సూర్యుడిలా/ ప్రతిరోజు నిను చూశా/ జనియించిందే/ ఒక స్వప్నం.. ‘ అనే పల్లవితో సాగే ఈ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ కు శివకుమార్ మ్యూజిక్ అందించగా, సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ దీన్ని ఆలపించారు.
Read Also : బాలకృష్ణ సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ
ప్రపంచీకరణ నేపధ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, పరాయి దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీనివల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా? మాజీ రాష్ట్రపతి స్వర్గీయ కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న సినిమా ‘ఏవమ్ జగత్’. ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ, ”వ్యవసాయం భవిష్యత్తు ఏమిటీ? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం గానీ మన దేశ యువతకి ఉందా? అనే అంశాలను ఇందులో చూపించాం. వ్యవసాయం మరియు మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే 20 ఏళ్ల యువకుడు కమల్ కథే ‘ఏవం జగత్’. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులకు, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడనేది ఆసక్తికరంగా ఉంటుంది” అని అన్నారు.