తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్రమైన ప్రతిష్టంబనను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు నిరంతరం కలకలలాడే థియేటర్లు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు నేడు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం స్టార్ హీరోల తీరు, వారి సినిమాల విడుదలలో జరుగుతున్న విపరీతమైన ఆలస్యమేనని సినీ విశ్లేషకులు, నిర్మాతలు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి రెండు, కనీసం ఒక సినిమా అయినా విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు పరిపరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమా సెట్స్పై రెండు నుండి మూడేళ్ల పాటు సమయం తీసుకుంటోంది. దీనివల్ల ఏళ్లు గడుస్తున్న కొద్దీ నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పెరిగిపోవడమే కాకుండా, నిర్మాతలు కోట్ల రూపాయల వడ్డీల భారాన్ని మోయాల్సి వస్తోంది. స్టార్స్ ఏడాదికి రెండు సినిమాలు చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఏటా ఒక్క సినిమాతో వచ్చినా థియేట్రికల్ వ్యవస్థ నిలబడుతుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టగల టాప్ స్టార్స్ వేళ్లమీద లెక్కపెట్టేలా ఐదుగురే ఉన్నారు. అయితే వీరి సినిమాల రాక మధ్య ఉంటోన్న గ్యాప్ థియేటర్ యజమానులను కోలుకోలేని దెబ్బతీస్తోంది.
-
ప్రభాస్ : ఈ ఏడాది ‘రాజాసాబ్’తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నాడు.
-
రామ్ చరణ్ : ‘పెద్ది’ చిత్రంతో రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్దకు వచ్చారు. నెక్ట్స్ సినిమా ఎప్పుడో ఎవరికీ క్లారిటీ లేదు.
-
అల్లు అర్జున్: ‘పుష్పా 1’ వచ్చిన మూడేళ్లకు ‘పుష్పా 2’ తో అలరించిన బన్నీ, తన తదుపరి చిత్రం ‘రాకా’ను 2027లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే మళ్లీ మూడేళ్ల గ్యాప్ వచ్చినట్టే.
-
మహేష్ బాబు : 2024 సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో వచ్చిన మహేష్, రాజమౌళితో చేస్తోన్న ‘వారణాసి’ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. అంటే మహేష్ సినిమా చూడటానికి దాదాపు మూడేళ్లు నిరీక్షించాల్సి వస్తోంది.
-
ఎన్టీఆర్ : ఈ ఏడాది ఎన్టీఆర్ బిగ్ స్క్రీన్పై కనిపించలేదు. 2025 ఆగస్టులో ‘వార్ 2’ రిలీజ్ కాగా, ప్రశాంత్ నీల్తో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం 2027 జూన్ 11న విడుదల కానుంది.
స్టార్ హీరోల సినిమాలు థియేటర్లకు రాకపోవడంతో ప్రేక్షకులు హాల్స్కు రావడం తగ్గించేశారు. దీని ప్రత్యక్ష ప్రభావం సింగిల్ స్క్రీన్లపై పడి, నష్టాలు రావడంతో నిర్వహకులు థియేటర్లను మూసివేస్తున్నారు. స్టార్స్ తమ వర్కింగ్ స్పీడ్ పెంచి క్రమం తప్పకుండా సినిమాలు తీస్తేనే ఎగ్జిబిషన్ రంగానికి మళ్లీ పూర్వవైభవం వస్తుందనడంలో సందేహం లేదు.

