Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్‌ల సిరీస్..

Operation Safed Sagar OTT: దేశభక్తి, యుద్ధం, సైనికుల త్యాగాల నేపథ్యంలో వచ్చే కథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కిన కథలను ప్రేక్షకులు అస్సలు వదలటం లేదు. ఇప్పుడు అలాంటి ఓ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైన వెంటనే సంచలనం సృష్టిస్తోంది. 1999 లో కార్గిల్ వార్ నేపథ్యంలో కేవలం ఆరు ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ సిరీస్ ఏంటి? ఇందులో చూపించిన కథ ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్‌లో 2026 ఆగస్టు 7న విడుదలైన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ సిరీస్ ను ప్రేక్షకుల విపరీతంగా ఆదరిస్తున్నారు. దీంతో ఈ సిరీస్ నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’లో ప్రముఖ నటులు సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటించారు. విభిన్నమైన నటీనటులతో రూపొందిన ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆగస్టు 7న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి కూడా సానుకూల స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.

కథ

‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ వెబ్ సిరీస్ 1999 కార్గిల్ యుద్ధ సమయంలో వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ఆధారంగా రూపొందించబడింది. చొరబాటుదారులను ఎదుర్కోవడానికి ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ పైలట్లు మైనస్ డిగ్రీల చలిలో, ప్రాణాంతక పరిస్థితులను అధిగమించి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసిన వీరోచిత గాథను ఈ సిరీస్ ఉత్కంఠభరితంగా చూపుతుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కలసి పోరాడి, కార్గిల్ కొండలపై మళ్లీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన విజయంతో ఈ సిరీస్ ముగుస్తుంది.

కార్గిల్ యుద్ధం భారత సైనిక చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటిగా నిలిచింది. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో భారత సైనికులు శత్రు బలగాలను ఎదుర్కొన్నారు. ఆ పోరాటంలో సైన్యం మాత్రమే కాకుండా, వైమానిక దళం కూడా కీలకమైన ఆపరేషన్లను నిర్వహించింది. ఇప్పుడు అదే నేపథ్యాన్ని ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇంతవరకు బయటకి కనిపించని కొన్ని కోణాలను కూడా ఇందులో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక ఈ సిరీస్, స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ప్రేక్షకుల ముందుకు రావడంతో డిజిటల్ గా ఈ హైప్ రావాడానికి కారణంగా కూడా కనిపిస్తోంది.

1999లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ సైన్యం భారత్‌కు తెలియకుండా లడఖ్‌లోని కార్గిల్ పర్వత ప్రాంతాలను రహస్యంగా ఆక్రమించుకోవడమే. ప్రతి సంవత్సరం శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా రెండు దేశాల సైన్యాలు సరిహద్దుల్లోని ఎత్తైన బంకర్ల నుండి తాత్కాలికంగా కిందికి దిగి వచ్చే ఆనవాయితీని ఆసరాగా చేసుకుని, పాక్ సైనికులు ఉగ్రవాదుల రూపంలో వచ్చి భారత భూభాగంలోకి చొరబడ్డారు. శ్రీనగర్ నుండి లెహ్ వెళ్లే ముఖ్యమైన జాతీయ రహదారిని తమ ఆధీనంలోకి తీసుకుని, లడఖ్‌కు భారత సైన్యం వెళ్లే దారిని కట్ చేయాలనేది పాకిస్తాన్ ప్లాన్. అయితే 1999 మే నెలలో ఈ చొరబాట్లను గుర్తించిన భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో ప్రాణాలకు తెగించి ఎదురుదాడి చేసి, రెండు నెలల పోరాటం తర్వాత జూలై 26 నాటికి పాక్ సైన్యాన్ని పూర్తిగా తరిమికొట్టి కార్గిల్ కొండలపై మళ్లీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.

కార్గిల్ యుద్ధాన్ని మరో కోణంలో చూపించడంతో పాటు, దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన భారత వైమానిక దళ వీరుల త్యాగాలను గుర్తుచేసే ప్రయత్నంగా ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ నిలుస్తోంది. అందుకే విడుదలైన వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 ట్రెండింగ్ సిరీస్‌గా ఈ వార్ సిరీస్ నిలిచింది.