NTV Telugu Site icon

NTR: థాంక్యూ చంద్రబాబు మావయ్య.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

Ntr

Ntr

NTR: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో నేడు ఇండియన్ సినిమా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమా అవార్డులను అందుకుంటూనే ఉంది. ఇక ఆస్కార్ కు మొదటిమెట్టు గా నేడు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకొని ఇండియా రేంజ్ ను ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో పలువురు ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ప్రశంసలు అందిస్తున్నారు. ప్రధాని మోడీ దగ్గరనుంచి సినీ, రాజకీయ ప్రముఖులు తమ శుభాకాంక్షలను తెలుపుతున్నారు.

ఇక తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ” ఆర్ఆర్ఆర్ మూవీ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెలుచుకుంది తెలుసుకొని సంతోషిస్తున్నాను. ఎమ్ఎమ్ కీరవాణి, రాజమౌళికి మరియు మొత్తం చిత్ర బృందానికి అభినందనలు. ఇది గర్వించదగ్గ విషయం. నేను ముందే చెప్పినట్లుగానే తెలుగు భాష ఇప్పుడు శక్తివంతంగా మారింది” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ పై ఎన్టీఆర్ స్పందించాడు. ‘థాంక్యూ సో మచ్ మావయ్య’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒకానొక సమయంలో టీడీపీ ప్రచారంలో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఏనాటికైనా ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తాడు అని టీడీపీ అభిమానుకు కోరుకుంటున్నారు. ఇక మరోపక్క ఎన్టీఆర్.. తనకు ప్రస్తుతం సినిమాలు చాలు అని, రావాల్సిన టైమ్ వస్తే వస్తాను అని చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.