సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. లేటెస్ట్ గా బ్రో సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తూ మేకర్స్ సెకండ్ సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘జాణవులే’ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో లాంచ్ చేయనున్నారు. ఈ లవ్ సాంగ్ లాంచ్ కోసం తిరుపతి వెళ్లిన సాయి ధరమ్ తేజ్, ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తిరుపతి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ రాహుకేతు పూజ చేయడంతో పాటు, స్వామివారిని దర్శించుకున్నాడు.
ఈ క్రమంలో ఉపాలయంలో ఉన్న చంగల్ రాయ స్వామి (సుబ్రమణ్యేశ్వర స్వామి) దగ్గరకు వచ్చాడు సాయి ధరమ్ తేజ్, వెంటనే అక్కడున్న సిబ్బంది హీరో చేతికి హారతి పల్లెం అందించారు. స్వయంగా సాయితేజ్ చేతుల మీదుగా స్వామివారికి హారతి ఇప్పించారు, దీంతో సమస్య మొదలయ్యింది. ఆలయ నిబంధనల్ని, ఆలయ ఆచారాల్ని అధికారులు, అర్చకులు పట్టించుకోలేదంటూ భక్తుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. శ్రీకాళహస్తిలో కేవలం అర్చకులు మాత్రమే పూజలు చేసి హారతులు ఇవ్వాలని, సామాన్య జనం హారతి ఇవ్వడం నిషిద్దమని తెలిసి కూడా అర్చకులు సాయి ధరమ్ తేజ్ తో హారతి ఎలా ఇప్పించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ నుంచి కానీ ఆలయ అర్చకుల నుంచి కానీ ఈ విషయంపై ఎలాంటి స్పందనా లేదు.
ఇదిలా ఉంటే ఈ విషయంపై శ్రీకాళహస్తీస్వర ఆలయ పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు సింగిరాజు బాలసుబ్రహ్మణ్యం శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. “పెద్దవారు పెట్టిన సాంప్రదాయాలను ఎవరూ మార్చ లేరు, అలాచేస్తే సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడమే. ఆలయాలలో దేవతలు కు పూజలు, అర్చనలకు అభిషేకాలు,హారతులు కు ఒక ఆచారం సాంప్రదాయం అనేది ఉంది. ఎవరంటే వారు వెళ్లి గుడిలోకి వెళ్లి దేవతలకు నైవేద్యాలు పెట్టడం, హారతులు ఇవ్వడం మంచి పద్ధతి కాదు. ఇలా ఎవరికి వారు హారతులు ఇస్తే ఇక అర్చకులు ఎందుకు ఉండేది? రాను రాను సాంప్రదాయాలను తుంగలోకి తోక్కుతున్నారు” అంటూ స్పందించారు.