Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్

Lurk 300kb

Lurk 300kb

Lurk OTT Release: మలయాళం సినిమాలు అంటేనే విభిన్నమైన కథలు, రియాలిటీ పాత్రలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా సర్వైవల్, ఫారెస్ట్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను కథలోకి లాగేయడంలో ముందుంటాయి. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన మలయాళం థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘లర్క్: ఐస్ ఆన్ ది ప్రే’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు ఐయండిబిలో 8.8 రేటింగ్ ఉండటం, థ్రిల్లర్ ప్రియుల్లో దీనిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

‘సన్ నెక్ట్స్’ (Sun NXT)లో స్ట్రీమింగ్ 

ఎం.ఏ. నిషాద్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ సోషల్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ‘లుర్క్’ (Lurk: Eyes on the Prey) 2026  జూలై 24న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రన్‌లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కేవలం నెల రోజుల్లోనే అంటే 2026 ఆగస్ట్ 26 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సన్ నెక్ట్స్’ (Sun NXT)లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు కూడా అందుబాటులోకి వచ్చింది.  ఏదో ఒక వింత రూపం అడవిలో నుంచి గమనిస్తోందని, ఏదో ఒక దాని కోసం ఎదురుచూస్తోందనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఈ ప్రకటనను విడుదల చేసింది. దీంతో అసలు ఆ అడవిలో దాగి ఉన్న ప్రమాదం ఏమిటనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇందులో దర్శకుడు నిషాద్ స్వయంగా కథను మలుపు తిప్పే షార్ప్‌షూటర్ జైరామ్ కళ్యాణరామన్ పాత్రను పోషించగా, సాయిజు కురుప్ అటవీ శాఖ మంత్రిగా, మంజు పిళ్లై జిల్లా కలెక్టర్‌గా కీలక పాత్రల్లో నటించారు. వీరితో పాటు అనుమోల్, అజు వర్గీస్, టి.జి. రవి, ప్రశాంత్ అలెగ్జాండర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.

కథ 

‘లుర్క్’ కథ కేరళలోని కొండ ప్రాంతాలు, దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకుని ఉండే ఒక గిరిజన గ్రామం చుట్టూ తిరుగుతుంది. అక్కడ అడవి ఏనుగులు, పులుల దాడుల వల్ల గిరిజనులు తమ ప్రాణాలను, పంటలను కోల్పోతూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ప్రభుత్వం, సమాజం వారి సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో, ప్రజలు నిరంతరం భయాందోళనల మధ్యే మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ సమస్య తీవ్రం కావడంతో, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ఫారెస్ట్ మినిస్టర్ (సాయిజు కురుప్), కలెక్టర్ (మంజు పిళ్లై) అటవీ శాఖ అధికారులు (అజు వర్గీస్) రంగంలోకి దిగుతారు. సమస్యను పరిష్కరించడానికి, అడవిలో అలజడి సృష్టిస్తున్న జంతువులను వేటాడటానికి జైరామ్ కళ్యాణరామన్ (M.A. నిషాద్) అనే నిపుణుడైన ప్రొఫెషనల్ షార్ప్‌షూటర్‌ను ఆ గ్రామానికి పిలిపిస్తారు.

షార్ప్‌షూటర్ అడవిలోకి ప్రవేశించిన తర్వాత కథలో అసలైన సస్పెన్స్ మొదలవుతుంది. జంతువుల దాడుల వెనుక మనుషులు చేస్తున్న కొన్ని చట్టవ్యతిరేక పనులు, రాజకీయ మోసాలు, గిరిజన ప్రజలపై జరుగుతున్న దోపిడీ బయటపడతాయి. జంతువుల కంటే స్వార్థపరులైన మనుషులే అత్యంత ప్రమాదకరమైన క్రూర జంతువులుగా మారి అడవిని ఎలా వేటాడుతున్నారనే నిజాన్ని చూపిస్తూ, ఆ అమాయక ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి చేసిన పోరాటంతో కథ ముగుస్తుంది.