Lock Upp 2 Winner: వారాల తరబడి ఉత్కంఠ, ఎమోషన్స్, వ్యూహాలు, అనూహ్య మలుపులతో సాగిన రియాలిటీ షో ‘లాక్ అప్ 2’ ఎట్టకేలకు నిన్న రాత్రి గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ప్రతి వారం కొత్త ట్విస్టులు, ఎలిమినేషన్లు, పోటీదారుల మధ్య విభేదాలు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేశాయి. చివరి వరకు జరిగిన హోరాహోరీ పోరులో శ్రేయా కల్రా విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకోవడంతో పాటు భారీ నగదు బహుమతిని కూడా దక్కించుకుంది. గట్టి పోటీ ఇచ్చిన టెలివిజన్ నటి శివాంగి జోషి రన్నరప్గా నిలిచింది. ఈ సీజన్కు రితేష్ దేశ్ముఖ్, ఫరా ఖాన్ హోస్ట్లుగా వ్యవహరించారు. కంటెస్టెంట్స్ కు హోస్ట్ ల మధ్య ఈ షో మంచి రేటింగ్ తో సాగింది. ఇందులో కంటెస్టెంట్స్ పర్సనల్ ఎమోషన్స్ తో ఈ రియాలిటీ షో మాత్రం పీక్స్ కు వెళ్ళింది. చివరగా గ్రాండ్ ఫినాలేలో విజేత పేరును ప్రకటించిన వెంటనే స్టేజ్ మొత్తం సంబరాలతో మార్మోగిపోయింది. శ్రేయా కల్రా ట్రోఫీని అందుకోవడంతో పాటు రూ.1 కోటి నగదు బహుమతిని కూడా గెలుచుకుని ఈ సీజన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన కంటెస్టెంట్ గా నిలిచింది. విన్నర్ ను ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానుల నుంచి శ్రేయాకు శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ఆమె ఆటతీరు, ఆత్మవిశ్వాసం, క్లిష్ట పరిస్థితుల్లో చూపిన సహనం ఈ విజయానికి ప్రధాన కారణమని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. షో ప్రారంభం నుంచి చివరి వరకు ఆమె ఆట తీరు, ప్రతి టాస్క్ను సవాల్గా తీసుకుని ముందుకు సాగడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈసారి విజేత ఎంపికలో ప్రత్యేక విధానాన్ని అనుసరించారు. మీడియా ప్రతినిధులు, మాజీ పోటీదారులు, ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో కూడిన 25 మంది సభ్యుల జ్యూరీ ఓట్ల ఆధారంగా తుది నిర్ణయం తీసుకున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, శ్రేయా కల్రాకు 18 మంది జ్యూరీ సభ్యులు, ఐదుగురు మాజీ పోటీదారుల మద్దతు లభించడంతో మొత్తం 23 ఓట్లు దక్కాయి. శివాంగి జోషికి సుమారు 14 నుంచి 15 ఓట్లు వచ్చినట్లు సమాచారం. మరోవైపు యోగేష్ రావత్కు మీడియా జ్యూరీ నుంచి కేవలం రెండు ఓట్లు మాత్రమే వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సీజన్ టాప్–5 ఫైనలిస్టులుగా శ్రేయా కల్రా, శివాంగి జోషి, శిల్పా షిండే, యోగేష్ రావత్, రామ్ కపూర్ నిలిచారు. ఫైనల్కు ముందు జరిగిన ఎలిమినేషన్లో ఆకాంక్ష చమోలా, వరుణ్ యాదవ్ షో నుంచి నిష్క్రమించడంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. మొత్తానికి, అనేక సవాళ్లను అధిగమిస్తూ చివరి వరకు నిలబడిన శ్రేయా కల్రా ‘లాక్ అప్ 2’లో విజేతగా మారడం చెప్పుకోదగ్గ విషయం. ట్రోఫీతో పాటు రూ.1 కోటి బహుమతిని సొంతం చేసుకున్న ఆమె, ఈ విజయంతో తన కెరీర్లో మరో కీలక మైలురాయిని అందుకుంది.

