Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!

Kriti Sanon (1)

Kriti Sanon (1)

Kriti Sanon: రక్షాబంధన్ యాడ్‌లో తాను ధరించిన దుస్తులు, పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై వచ్చిన విమర్శలకు బాలీవుడ్ నటి కృతి సనన్ గట్టిగా స్పందించారు. సంస్కృతి, సంప్రదాయాలను దుస్తులతో కొలవడం సరికాదని స్పష్టం చేస్తూ, మహిళలు ఏం ధరించాలో ఇతరులు నిర్ణయించే ధోరణిపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వివాదంలో నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి.

రక్షాబంధన్ సందర్భంగా ప్రముఖ ఆభరణాల బ్రాండ్ గివా కోసం రూపొందించిన ఓ ప్రకటనలో కృతి సనన్ ఆఫ్ వైట్ రంగు ఇండో వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించారు. బ్రాలెట్ తరహా బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్‌తో ఉన్న ఈ లుక్ సోషల్ మీడియాలో కొందరికి నచ్చగా, మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శించారు. సంప్రదాయ భారతీయ పండుగను చూపించే ప్రకటనలో ఇలాంటి దుస్తులు సరిపోవని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, కృతి తన పెంపుడు కుక్కకు రాఖీ కట్టడం కూడా కొందరి విమర్శలకు కారణమైంది.

ఈ ట్రోలింగ్‌పై కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా స్పందించారు. పండుగల అసలు సారం మనం ధరించే దుస్తుల్లో ఉండదని, సంప్రదాయాల పట్ల మనకున్న భావోద్వేగంలో, వాటికి మనం ఇచ్చే అర్థంలో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. రక్షాబంధన్ అంటే కేవలం ఒక సోదరుడు తన సోదరిని రక్షిస్తాననే భావన మాత్రమే కాదని, పరస్పరం ఒకరికొకరు అండగా నిలిచే ప్రేమ, నమ్మకానికి ప్రతీక అని వివరించారు.

తాను, తన సోదరి నూపుర్ సనన్ ప్రతి ఏడాది ఒకరికొకరు రాఖీ కట్టుకుంటామని కృతి తెలిపారు. ఒకరి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయువు కోసం మరొకరు ప్రార్థించుకుంటామని చెప్పారు. తమ పెంపుడు కుక్కలు కూడా కుటుంబంలో భాగమే కాబట్టి వాటిపై ప్రేమతో రాఖీ కట్టడం తమకు సహజమైన విషయమేనని ఆమె వివరించారు. దీంతో పెంపుడు జంతువులకు రాఖీ కట్టడంపై వచ్చిన విమర్శలకు కూడా ఆమె సమాధానం ఇచ్చినట్లయింది.

అయితే కృతి స్పందనలో అత్యంత ఆసక్తికరమైన అంశం మహిళల దుస్తులపై సమాజం పెట్టే నిబంధనల గురించి ఆమె లేవనెత్తిన ప్రశ్న. మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతామని ఆమె ప్రశ్నించారు. కాలంతో పాటు ఫ్యాషన్ మారుతుందని, సంప్రదాయ దుస్తులకూ కొత్త రూపాలు వస్తుంటాయని పేర్కొన్నారు. ఒక మహిళ తన సంస్కృతి పట్ల ఎంత గౌరవం కలిగి ఉందో కేవలం ఆమె ధరించిన దుస్తులను చూసి నిర్ణయించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. సంస్కృతి, సంప్రదాయాలు మనిషి హృదయంలో ఉంటాయని, దుస్తుల్లో ఉండవని కృతి స్పష్టం చేశారు.

ఇదే సమయంలో నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ కూడా ఈ అంశంపై స్పందించారు. మహిళలకు తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని చెబుతూనే, సందర్భాన్ని బట్టి కొన్ని హద్దులను పాటించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాక్‌టెయిల్ దుస్తుల నుంచి లెహంగా చోళీ వరకు, జీన్స్ నుంచి చీర వరకు, బికినీ నుంచి సల్వార్ కమీజ్ వరకు మహిళలకు ఎన్నో రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయని కంగనా పేర్కొన్నారు. అయితే సోదరుడికి రాఖీ కట్టే సందర్భంలో మరింత సందర్భోచితమైన దుస్తులను ఎంచుకోవచ్చుగా అంటూ కృతి లుక్‌పై వ్యంగ్యంగా ప్రశ్నించారు.

ఇక కృతికి మద్దతుగా రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. ఇప్పుడు కృతి చెల్లెలు కూడా స్పందించారు. డ్రెస్ ఎంచుకునే హక్కు ఆడవాళ్లకు ఉంటుందని, కాలానికి తగ్గట్టు మనం కూడా మారాలని హితవు పలుకుతున్నారు. అయితే ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో మహిళల వేషధారణ మీద ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ దీనిని ఒక కాంట్రవర్సీ చేస్తున్నారు. మరి ఈ దుస్తుల లెక్కలకు శుభం కార్డు ఎప్పుడు పడుతుందో.