తెలుగు, తమిళ, హిందీతో పాటు ఓటీటీ ప్రాజెక్టులతో కీర్తి సురేష్ బిజీ బిజీగా ఉంది. ఇటీవల ఒక సినిమా సెట్లో వరుసగా 20 గంటలకు పైగా షూటింగ్ పూర్తి చేసుకుని, కేవలం ఒక్క గంట వ్యవధిలోనే మరో సినిమా సెట్కు బయలుదేరినట్లు వెల్లడించారు. అలా దాదాపు 41 గంటల పాటు నిద్రపోకుండా నిరంతరం పనిచేసినట్లు స్పష్టం చేశారు. “ఇలాంటి బిజీ షెడ్యూల్ దొరకడం ఒక ఆశీర్వాదం” అని చెబుతూ ‘ఐ విల్ సర్వైవ్’ అని ఉన్న టీ-షర్ట్ ధరించిన పోస్ట్ షేర్ చేయగా, ఇది సినీ పరిశ్రమలో పని గంటలపై కొత్త చర్చకు తెరలేపింది.
ప్రస్తుతం కీర్తి సురేష్ లైనప్లో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ‘డోరతీ’ సినిమా అత్యంత ప్రధానమైనది. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అంతకంటే ముందే ప్రతిష్టాత్మక ‘టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో’ ప్రదర్శితం కానుండటం విశేషం. మరోవైపు విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్దన’ అనే హై-వోల్టేజ్ పాన్ ఇండియా యాక్షన్ చిత్రంలో కథానాయికగా అలరించనున్నారు. ఇక టాలీవుడ్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ ‘VenkyAnil5’ చిత్రంలోనూ కీర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళంలోనూ ఆమె జోరు కొనసాగుతోంది. గణేష్ రాజ్ దర్శకత్వంలో ‘కన్నివేది’ అనే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్తో పాటు, మైస్కిన్ దర్శకత్వంలో ‘సత్యవన్ సావిత్రి’ అనే డిఫరెంట్ ఫిల్మ్లోనూ నటిస్తూ వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నారు. వెండితెరనే కాకుండా డిజిటల్ వేదికపై కూడా కీర్తి సురేష్ తన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. నెట్ఫ్లిక్స్ వేదికగా రూపుదిద్దుకుంటున్న ‘అక్క’ అనే పవర్ఫుల్ వెబ్ సిరీస్ ద్వారా ఆమె ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఎంతటి శారీరక శ్రమైనా చిరునవ్వుతో స్వీకరిస్తూ కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు బిగ్ కమర్షియల్ సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్న కీర్తి సురేష్ ప్రాజెక్టుల గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతోంది.

