Kancharla Movie Update: సమ సమాజం, నవ సమాజ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చే సినిమాలు ఎన్నో రాగా ఆ కోవకు చెందిన కధాంశంతో “కంచర్ల” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎస్.ఎస్.ఎల్.ఎస్ (S S L S) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా రెడ్డెం యాద కుమార్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుత రావు నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత కంచర్ల అచ్యుత రావు తెలియజేస్తూ, “ప్రస్తుతం పాటల షూటింగ్ కేరళ, గోవా, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో జరుపుతున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుతున్నాం అని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, భూస్వాముల దగ్గర ఉన్న భూమి పేద ప్రజలకు పంచాలన్నది ఈ చిత్ర ప్రధానాంశం అని అయితే కమర్షియల్ అంశాలను మేళవించి, ప్రేక్షకులను అలరింపజేసేలా చిత్రాన్ని మలచడం జరుగుతోందని చెప్పారు.
హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, “ఇటీవల నేను నటించిన ఉపేంద్ర గాడి అడ్డా” సినిమా విడుదలైంది. ఆ సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నేను ఈ సినిమా ద్వారా మరింత దగ్గరవుతానని నమ్మకంగా చెప్పగలనన్నారు. ఇక దర్శకుడు రెడ్డెం యాద కుమార్ మాట్లాడుతూ, సామాజిక సృహతో సమాజాన్ని జాగృతం చేసే అంశాలను ఇందులో పొందుపరిచామని అన్నారు. ఇక ఈ సినిమాలోని ఇతర పాత్రలలో సుమన్, అజయ్ ఘోష్, కాశీ విశ్వనాథ్, సుధ, రాజా రవీంద్ర, సుమన్ శెట్టి, దువ్వాసి మోహన్, జబర్దస్త్ దొరబాబు, ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు. కుంచె రఘు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి గుణశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.