యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే వైద్యులు ఎన్టీఆర్ కు తగిన చికిత్స అందించి సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని స్పష్టం చేశారు. పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి షూటింగ్స్లోనూ పాల్గొనవద్దని వైద్యులు సూచించారు.
ఈ పరిణామంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందగా హెల్త్ అప్డేట్పై ఎన్టీఆర్ టీమ్ భరోసా ఇచ్చింది. అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, తారక్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని స్పష్టం చేసింది. అయితే తారక్ గాయం కారణంగా ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ముఖ్యంగా మేకర్స్ ప్లాన్ చేసిన భారీ శ్రీలంక షెడ్యూల్ను చిత్ర యూనిట్ పూర్తిగా క్యాన్సల్ చేయాల్సి వచ్చిందని సమాచారం. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే షెడ్యూల్ను ప్రారంభించనున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి పట్టాలెక్కే అవకాశముంది. షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది. గతంలో ప్రకటించినట్లే జూన్ 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

