Tollywood: తెలుగు చిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకొంది. చిత్ర పరిశ్రమలోని అన్ని సమస్యలకు పరిష్కారం దొరికేవరకు షూటింగ్స్ ను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నేడు తెలుగు చిత్రసీమకు చెందిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ స్టూడియోలో సమావేశం అయ్యి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా పాండమిక్ తరువాత రెవిన్యూ తగ్గి, ఖర్చులు పెరిగాయని, వాటి గురించి చర్చించినట్లు తెలిపారు.
తమ సినిమాలను మంచి వాతావరణంలో రిలీజ్ చేయాలని తాము కోరుకుంటున్నామని, అది తమ బాధ్యత అని తెలిపిన ప్రొడ్యూసర్ గిల్డ్ అన్ని సమస్యలకు పరిష్కారం వెతకడానికి తాత్కాలికంగా ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యలన్నీ చక్కదిద్దడానికి నిర్మాతలందరూ మరోసారి భేటీ కానున్నట్లు తెలిపారు. అయితే నిర్మాతల మండలి నిర్ణయాన్ని పలువురు విమర్శిస్తున్నారు. దీనివలన కార్మికులు నష్టపోతారని, అన్ని రోజులు షూటింగ్స్ లేకపోతే వారికి తిండి ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయమై నిర్మాతల మండలి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.