Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!

Dhanush Kareenakapoorfilm

Dhanush Kareenakapoorfilm

Dhanush-Kareena Kapoor: ధనుష్, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు-నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ మైథలాజికల్ జంగిల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌ను 2026 ఏప్రిల్ 28న అధికారికంగా ప్రకటించారు. ‘భన్సాలీ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై సంజయ్ లీలా భన్సాలీ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దట్టమైన అడవుల నేపథ్యంలో సాగే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ధనుష్ సరసన కథానాయికగా నటించడానికి బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ తో చర్చలు జరుగుతుండగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను 2027 ప్రారంభంలో మొదలుపెట్టేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ఇటీవలి కాలంలో సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సంవత్సరానికి ఒకటి లేదా రెండు ప్రాజెక్టులకే పరిమితమవుతున్న ఆమె, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ భారీ పౌరాణిక అడ్వెంచర్‌ మూవీలో కరీనా ధనుష్ కు జోడీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం కరీనా కపూర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ధనుష్, భన్సాలీ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ మూవీకి తమిళ దర్శకుడు పి.ఎస్. మిథ్రాన్ దర్శకత్వం వహించనున్నారు. ‘ఇరుంబు తిరై’, ‘హీరో’, ‘సర్దార్’ వంటి విజయవంతమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిథ్రాన్‌కు ఇది తొలి బాలీవుడ్ మూవీ. అదే సమయంలో ధనుష్‌తో కూడా ఆయన మొదటిసారి కలిసి పనిచేయనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా దట్టమైన అడవి నేపథ్యంలో సాగే భారీ పౌరాణిక సాహస గాథగా రూపొందనుందని సమాచారం. కథను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సంజయ్ లీలా భన్సాలీ సూచనలతో స్క్రిప్ట్‌ను పలుమార్లు సవరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. భారీ విజువల్స్, విభిన్న కథాంశం, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 ప్రారంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కరీనా కపూర్ ఈ ప్రాజెక్ట్‌లో చేరితే సినిమాకు మరింత స్టార్ వాల్యూ పెరుగుతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధనుష్ ఇప్పటికే పలు భాషల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించగా, ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్ లో ఆయనకు మరో కీలక అడుగుగా మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ కొత్త పౌరాణిక ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాపై వస్తున్న వివరాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. కరీనా కపూర్ పాత్ర, ఇతర నటీనటులు, సినిమా టైటిల్ వంటి అంశాలపై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అయితే ధనుష్, కరీనా కపూర్ తొలిసారి ఒకే తెరపై కనిపించే అవకాశం ఉందనే వార్త ఈ మూవీపై మంచి బజ్ ను పెంచుతోంది.