తెలంగాణ సంస్కృతి, కళలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్కు హాజరయ్యే ప్రపంచ ప్రతినిధులను మన భిన్న సాంస్కృతిక మరియు కళారూపాలతో ఆహ్వానించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య ఆకర్షణగా, ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన అద్భుతమైన సంగీత కచేరితో అతిథులను అలరించనున్నారు. ఆయన 90 నిమిషాల పాటు ప్రత్యేక సంగీత కచేరిని నిర్వహించనున్నారు.
కీరవాణి కచేరీతో పాటు, అనేక ఇతర కళా ప్రదర్శనలు ఈ సమ్మిట్కు ప్రత్యేక శోభను తేనున్నాయి:
*వీణా విద్యాంసురాలు పి. జయలక్ష్మీ గారి వీణా కార్యక్రమం.
*కళా కృష్ణ ఆధ్వర్యంలో మన సాంప్రదాయ పేరణి నాట్యం.
*ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.
Also Read :Akhanda 2: తెలంగాణాలో కూడా పెరిగిన అఖండ 2 టికెట్ రేట్లు.. జీవో వచ్చేసింది!
తెలంగాణ సంప్రదాయ కళారూపాల సందడి
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, కళలను ప్రతిబింబిస్తూ అనేక ప్రజా కళారూపాలు సమ్మిట్లో సందడి చేయనున్నాయి. ఈ ప్రదర్శనలు అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి:
* కొమ్ము కోయ
* బంజారా
* కోలాటం
* గుస్సాడి
* ఒగ్గు డోలు
* మహిళల డప్పులు
* పేరణి నృత్యం
* బోనాల కోలాటం
ఈ కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సాంస్కృతిక వేడుకలను డిసెంబర్ 10 నుంచి 13 తేదీ వరకు ప్రజలందరూ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు రోజుల పాటు రోజంతా మ్యూజికల్ ఆర్కెస్ట్రాను నిర్వహించనున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
