ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ మూవీలో కఠారి శ్రీనుగా నటించి, ఆకట్టుకున్నాడు సముతిరకని. బేసికల్ గా చక్కని రచయిత, దర్శకుడు అయిన సముతిరకని కొంతకాలంగా అర్థవంతమైన పాత్రలూ పోషిస్తున్నారు. తెలుగులోనూ రెండు మూడు చిత్రాలను డైరెక్ట్ చేసిన సముతిరకని, ‘అల వైకుంఠపురములో’ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. ప్రస్తుతం ఆయన ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘ఆకాశవాణి’లో చంద్రమాస్టారు పాత్ర పోషిస్తున్నాడు. అలానే హర్ష పులిపాక దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పంచతంత్రం’లో రామనాథం అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గా నటిస్తున్నారు. సోమవారం సముతిరకని పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పాత్రల పోస్టర్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా ‘పంచతంత్రం’ నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్థన్ మాట్లాడుతూ, ‘గొప్ప నటుడు, వ్యక్తి అయిన సముతిరకని మా సినిమాలో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఓ నటుడిగా ఆయనలో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. మరో పది రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం” అని అన్నారు.
‘పంచతంత్రం’లో రామనాథంగా సముతిరకని!
