Sesha 2016: ఓటీటీలోకి వచ్చిన ఒక థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ను పంచుతుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ గోడల మధ్య ఈ కథ భయంకరంగా సాగుతుంది. బయట చీకటి అడవి … లోపల నిద్రలేని పోలీసులు… ఇంతలో వచ్చిన ఒక ఫోన్ కాల్తో ఈ సినిమా కథ పీక్స్కు వెళ్తుంది. తెల్లారేలోగా మీ అందరినీ చంపేస్తా అనే ఒక్క హెచ్చరికతో మొదలయ్యే ఆ రాత్రి నరకయాతనగా ఎలా మారిపోతుందనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘శేష 2016’. ఒకే ఒక్క రాత్రిలో జరిగే కథను అంత ఉత్కంఠభరితంగా చెప్పడం ఈ మూవీకి అతిపెద్ద బలం అని ఇప్పటికే చూసిన వాళ్లు చెబుతున్నారు.
2026 మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మే 22 నుంచి Sun NXT ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ కన్నడ, మలయాళ భాషల్లో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా అధికారికంగా రాకపోయినా, సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్, సింగిల్ నైట్ సర్వైవల్ డ్రామాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథలు ఇష్టపడే వారికి ‘శేష 2016’ ఒక పక్కా సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగల సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాత్రలో దేవరాజ్, ఏఎస్ఐ ఆంథోనీ వర్గీస్ పాత్రలో ప్రమోద్ శెట్టి, ఎస్ఐ దాస్ పాత్రలో జాన్ కైప్పల్లిల్ పవర్ఫుల్ రోల్ లో నటించారు.
ఈ సినిమా కథ ఏమిటంటే..
2016 కాలంలో కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతంలోని ఒక మారుమూల పోలీస్ స్టేషన్లో ఈ కథ స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ దాస్ పాత్రలో జాన్ కైప్పల్లిల్, ఏఎస్ఐ ఆంథోనీ పాత్రలో ప్రమోద్ శెట్టి తమ నటనతో ఈ కథను ముందుకు తీసుకెళ్తారు. నైట్ డ్యూటీ సమయంలో ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఫస్ట్ అది ఒక ఫేక్ కాల్ అనుకుని పోలీసులు నవ్వేసినా, కొద్దిసేపటికే స్టేషన్లో ఒక పోలీస్ అధికారి హత్యకు గురవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. చుట్టూ అడవి, బయటికి వెళ్లే దారి లేదు, కమ్యూనికేషన్ సరిగ్గా పని చేయదు. ఆ సమయంలో స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ అనుమానితుల్లా కనిపించడం మొదలవుతుంది. దీంతో పోలీసులు కూడా ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే, హంతకుడు వీళ్లను చంపడం కోసం రాలేదు. అతని వెనుక ఒక గాయపడ్డ గతం ఉంటుంది. పోలీసుల వల్ల అతనికి జరిగిన అన్యాయం, ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. అదే సమయంలో డీఎస్పీ పాత్రలో నటించిన దేవరాజ్ ఎంట్రీతో కథ మరింత ఇంటెన్స్గా మారుతుంది. ఎవరు నిజాయితీపరులు? ఎవరు దోషులు? చివరికి తెల్లారేసరికి ఎవరెవరు ప్రాణాలతో మిగిలారు? అనే ఆసక్తి ప్రేక్షకుడిని చివరి నిమిషం వరకు కుర్చీకి కట్టిపడేస్తుంది.
