Naga Vamsi: టీడీపీకి 25 లక్షల విరాళం..

Nagavamsi

Nagavamsi

ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న యువ నిర్మాత నాగ వంశీ. తెలుగుదేశం పార్టీకి ఏకంగా పాతిక లక్షల విరాళం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. నాగ వంశీ విరాళం ఇచ్చిన విషయాన్ని స్వయంగా చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. ఈ ఏడాది మహానాడు వేడుకలను కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. నిన్నటి నుండి ప్రారంభమైన ఈ వేడుకలలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి విరాళాలు అందించిన వారి పేర్లను బహిరంగంగా చదివి వినిపించారు. ఈ సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మాత నాగ వంశీ పాతిక లక్షలు అందించినట్లు చంద్రబాబు ప్రకటించారు.

Also Read : Mahesh Babu: రాజమౌళి సినిమా తర్వాత పరిస్థితి ఏంటి?

ప్రస్తుతానికి సితార బ్యానర్‌కు పవన్ కళ్యాణ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగే త్రివిక్రమ్‌తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దాదాపుగా ఈ బ్యానర్‌లో ఏ సినిమా చేసినా అది త్రివిక్రమ్ భాగస్వామ్యంతోనే రూపొందుతుంది. ఈ క్రమంలో త్రివిక్రమ్ భార్య సౌజన్య పేరును నిర్మాతలలో ఒకరిగా ప్రస్తావిస్తారు. అలాగే త్రివిక్రమ్‌కు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌ను సహనిర్మాణ సంస్థగా ప్రస్తావిస్తారు. అలా ఒక పక్క పవన్ కళ్యాణ్‌తో, అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తున్న నాగ వంశీ తెలుగుదేశం పార్టీకి ఏకంగా పాతిక లక్షల విరాళం అందించడం చర్చనీయాంశమవుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాగ వంశీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అయినా సరే, తెలుగుదేశం పార్టీకి 25 లక్షల విరాళం అందించడం గమనార్హం.