Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్

Prithviraj Sukumaran 300kb

Prithviraj Sukumaran 300kb

Daayra: బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్, వైవిధ్యభరితమైన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ధాయ్‌రా’ (Daayra). జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకురాలు మేఘ్నా గుల్జార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్ పెన్ స్టూడియోస్ పతాకాలపై వినీత్ జైన్, ధవల్ గడా నిర్మిస్తున్న ఈ మూవీ 2026 సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా  ఓ యూత్ షోలో పాల్గొన్న కరీనా కపూర్ ఖాన్.. నేటి ప్రేక్షకుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు తాము అనుకున్నదానికంటే చాలా తెలివైనవారని ఆమె అన్నారు. యువ నటీనటులను తీసుకుని సినిమా చేస్తే ఇది వరకు సినిమాలు హిట్ అయ్యేవని, అయితే ఆ ఫార్ములా ఇప్పుడు పనిచేయదని చెప్పారు. ప్రేక్షకులు కంటెంట్ ఉన్న కథనాన్ని కోరుకుంటున్నారని కరీనా అభిప్రాయపడ్డారు.

కరీనా వ్యాఖ్యలతో ఏకీభవించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా స్టార్ ఇమేజ్ కంటే మంచి కథ ఎంత ముఖ్యమో వివరించారు. ఇందుకు ఆయన బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, రేఖలను ఉదాహరణగా తీసుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రేఖ కలిసి సినిమా చేస్తున్నారంటే తాను ఎలాంటి ఆలోచన లేకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి వెళ్తానని పృథ్వీరాజ్ చెప్పారు. అయితే అలాంటి సినిమాకు కూడా చివరికి ప్రేక్షకులను ఆకట్టుకునేది కథ, మేకింగ్‌ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, సినిమాలో దమ్ము లేకపోతే అంత పెద్ద స్టార్ ల సినిమాలకు కూడా స్పందన కరువవుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పృథ్వీరాజ్, కరీనా కలిసి నటించిన ‘ధాయ్‌రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు ముందు ఇద్దరూ వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ మూవీపై బజ్ పెంచుతున్నారు.

”ధాయ్‌రా’ లో కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరూ పోలీస్ అధికారుల పాత్రల్లో కనిపించనున్నారు. దేశాన్ని కుదిపేసే ఓ ఘోరమైన నేరం చుట్టూ కథ తిరుగుతుంది. ఆ నేరం తర్వాత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ కేసును ఛేదించేందుకు కరీనా, పృథ్వీరాజ్ పాత్రలు ఎలాంటి దర్యాప్తు చేపట్టాయి? నేరం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనే అంశాలతో సినిమా ఉత్కంఠంగా సాగనుంది. స్టార్ హీరో, స్టార్ హీరోయిన్, భారీ ప్రమోషన్స్ ఉన్నంత మాత్రాన సినిమా ప్రేక్షకులకు నచ్చదనే విషయాన్ని ఈ మధ్యకాలంలో వచ్చిన పలు సినిమాల ఫలితాలు కూడా చూపిస్తున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే కొత్త నటీనటులతో వచ్చిన సినిమాలను కూడా ప్రేక్షకులు భారీగా ఆదరిస్తున్నారు. అదే సమయంలో భారీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాకు కథలో బలం లేకపోతే మొదటి షో నుంచే స్పందన మారిపోతోంది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో సెప్టెంబర్ 18న తేలనుంది.