సూపర్ స్టార్ కృష్ణ స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘పద్మాలయా స్టుడియోస్‘ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త విప్లవాలకు, సంచలన చిత్రాలకు వేదికగా నిలిచింది. అయితే ఈ చారిత్రాత్మక బ్యానర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతపై పద్మాలయా నిర్మాతలైన ఆదిశేషగిరిరావు ఆసక్తికర భావోద్వేగ ప్రకటన చేశారు. ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన తదుపరి తరం హీరో జై కృష్ణ చేతుల్లోకే పద్మాలయా సంస్థ బాధ్యతలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పూర్తిస్థాయిలో తన నటనపైనే దృష్టి సారించారు. అంతేకాకుండా తన సొంత బ్యానర్ GMB ఎంటర్టైన్మెంట్స్ వ్యవహారాలు, పాన్-వరల్డ్ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ ఐకానిక్ బ్యానర్ అయిన పద్మాలయా స్టుడియోస్ను పునరుద్ధరించి, ఆ దిగ్గజ వారసత్వాన్ని ముందుకు నడిపించే పూర్తి బాధ్యతను దివంగత రమేష్ బాబు కుమారుడు జై కృష్ణపై ఉందని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు తెలిపారు. శ్రీనివాస మంగాపురం థాంక్స్ మీట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆదిశేషగిరి రావ్ మాట్లాడుతూ’ సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు అలాగే మహేశ్ బాబు లెగసీని కంటిన్యూ చేసే బాధ్యత జై కృష్ణపై ఉంది అలాగే పద్మాలయ లెగసిని కంటిన్యూ చేసే భాద్యత కూడా జై కృష్ణపై ఉందని అన్నారు. ఈ క్రమంలోనే పద్మాలయా బ్యానర్ను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడంలో జై కృష్ణ కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకప్పుడు ‘అల్లూరి సీతారామరాజు’, ‘సింహాసనం’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి అద్భుతమైన చిత్రాలను అందించిన పద్మాలయా సంస్థను జై కృష్ణ ఏ విధంగా ముందుకు నడిపిస్తారో చూడాలి.

