దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 16 ఘనంగా ముగిసింది. ఉత్కంఠభరితమైన గ్రాండ్ ఫినాలేలో అద్భుతమైన గాన ప్రతిభతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచింది. ఆమె ప్రతిష్ఠాత్మక ట్రోఫీతో పాటు రూ.20 లక్షల నగదు బహుమతిని అందుకుంది.
ఫైనల్లో ఉత్కంఠ
ఫైనల్ పోటీలో అన్షికా చోంకర్, జ్యోతిర్మయి నాయక్, మన్రాజ్ వీర్ సింగ్, సుహైల్ సూఫీ, తనిష్క్ శుక్లాతో పాటు మిస్మీ బోస్ (మైస్మ్మే బోసు) పాల్గొన్నారు. స్పాట్లైట్ రౌండ్ అనంతరం మిస్మీ బోస్ ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా అన్షికా చోంకర్, సుహైల్ సూఫీ కూడా పోటీ నుంచి నిష్క్రమించారు. వీరికి సోనీ టెలివిజన్ తరఫున రూ.3 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేశారు.
తన గానంతో ఆకట్టుకున్న జ్యోతిర్మయి
ఇండియన్ ఐడల్ ప్రయాణంలో జ్యోతిర్మయి నాయక్ ఎన్నో మధురమైన పాటలను ఆలపించి న్యాయనిర్ణేతలతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించింది. ముఖ్యంగా ‘ఓ జబ్ తక్ హై జాన్ జానే జహాన్ మై నాచుంగీ’, ‘జానే క్యోన్ లోగ్ మొహబ్బత్ కియా కర్తే హై’ వంటి పాటలతో ఆమె తన ప్రతిభను చాటుకుంది.
విజయం అనంతరం జ్యోతిర్మయి భావోద్వేగం
విజేతగా నిలిచిన అనంతరం జ్యోతిర్మయి మాట్లాడుతూ, “ఇండియన్ ఐడల్ సీజన్ 16 గెలవడం ఇప్పటికీ కలలా అనిపిస్తోంది. కేవలం ఒక కలతో ఆడిషన్స్కు వచ్చిన నేను, నేడు విజేతగా నిలవడం జీవితాన్ని మార్చిన అనుభవం. ఈ ప్రయాణం నన్ను మంచి గాయని మాత్రమే కాదు, మంచి వ్యక్తిగా కూడా తీర్చిదిద్దింది. నాకు అవకాశం ఇచ్చిన సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, ఫ్రీమాంటిల్, మా న్యాయనిర్ణేతలు, హోస్ట్ ఆదిత్య నారాయణ్, కార్యక్రమం వెనుక పనిచేసిన ప్రతి ఒక్కరికీ, నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, నన్ను నమ్మి ఓటు వేసిన అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ట్రోఫీ నాది మాత్రమే కాదు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరిదీ.” అని భావోద్వేగంగా చెప్పింది.
గ్రాండ్ ఫినాలేకు సినీ, సంగీత ప్రముఖులు
ఈ గ్రాండ్ ఫినాలే వేడుకకు ప్రముఖ గాయనులు, సినీ తారలు ఉషా ఉతుప్, ఉదిత్ నారాయణ్, పాపోన్, కుమార్ సాను, షెహనాజ్ గిల్, ఊర్మిళా మటోండ్కర్ ప్రత్యేక అతిథులుగా హాజరై కార్యక్రమానికి మరింత బజ్ తీసుకొచ్చారు.
అక్టోబర్ 2025లో ప్రారంభమైన సీజన్
హోస్ట్ ఆదిత్య నారాయణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఇండియన్ ఐడల్ 16, ‘యాదోన్ కి ప్లేలిస్ట్’ అనే థీమ్తో 2025 అక్టోబర్లో ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన గాయకులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తూ చివరకు జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచింది.

