హార్బర్ బ్యాక్ డ్రాప్ లో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ‘జెట్టి’. నందిత శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వేణుమాధవ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ కొండకండ్ల సంగీతం అందించారు. ఈ మూవీలోని తొలి గీతం ‘దూరం కరిగినా… మౌనం కరుగునా…’ అనే గీతాన్ని దర్శకుడు వేణు ఊడుగుల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘శ్రీమణి రాసిన ఈ పాట ఎంతో అర్థవంతంగా ఉందని, ఈ పాటకు సంబంధించిన కొన్ని షాట్స్ ను సైతం చూశానని, ఎంతో చక్కగా ఉన్నాయ’ని అన్నారు. మత్స్యకారుల జీవితాల్లోని కన్నీటి అలలను, సమస్యల సుడిగుండాలను విశదీకరించే చిత్రమే ‘జెట్టి’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. తన స్టూడియోకు వచ్చి వేణు ఊడుగుల ఈ పాటను ఆవిష్కరించడం పట్ల సంగీత దర్శకుడు కార్తిక్ కొండకండ్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడరని, ఈ మెలోడీ గీతం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని, సినిమాలో ఇదే మొదటి పాటగా వస్తుందని చెప్పారు.
విడుదలైన ‘జెట్టి’ మూవీ తొలి గీతం!
